LOADING...
Telangana Inter: అటు సీసీ కెమెరాలు.. ఇటు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు..ఇంటర్‌ ప్రాక్టికల్స్‌పై కట్టుదిట్టమైన నిఘా
ఇంటర్‌ ప్రాక్టికల్స్‌పై కట్టుదిట్టమైన నిఘా

Telangana Inter: అటు సీసీ కెమెరాలు.. ఇటు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు..ఇంటర్‌ ప్రాక్టికల్స్‌పై కట్టుదిట్టమైన నిఘా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఇంటర్‌మీడియట్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహణను మరింత కట్టుదిట్టం చేయడానికి బోర్డు చర్యలు మొదలుపెట్టింది. గత ఏడాది పరీక్షల సమయంలో సీసీ కెమెరాల సహాయంతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షణ జరిపినప్పటికీ, ఈ సారి అదనంగా భారీ సంఖ్యలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఇంటర్‌ రెండో సంవత్సరం, అలాగే వొకేషనల్‌ మొదటి-రెండో సంవత్సరాల విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులు హాజరుకాబోతున్నారు.

వివరాలు 

సీసీ కెమెరాలను తప్పనిసరి

గతసారి కెమెరాలు అమర్చినప్పటికీ, నిర్ణయం చివరి నిమిషంలో రావడంతో అనేక ప్రైవేట్‌ కళాశాలలు వాటిని సక్రమంగా ఏర్పాటు చేయలేకపోయాయి. పైగా, కెమెరాలున్నాయని భావించి బోర్డు డిపార్ట్‌మెంటల్‌ అధికారులను పర్యవేక్షణకు పంపలేదు. ఈసారి అయితే ఏ పరీక్షా కేంద్రం కూడా మినహాయింపు లేకుండా సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చనున్నారు. అదనంగా, విభాగాధికారులతో కూడిన మరిన్ని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ జట్లను నియమించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు.

వివరాలు 

ప్రభుత్వ-ప్రైవేట్‌ కళాశాలలు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోనే  ప్రాక్టికల్స్‌ 

కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉండడం, అలాగే ఇతర గురుకులాలు తమ తమ శాఖల ఆధీనంలో ఉండడం వల్ల, వాటిలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, ఆ ఫుటేజ్‌ బోర్డు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరదు. అంతేకాక, అక్కడ జరిగే అక్రమాలపై చర్యలు తీసుకునే అధికారమూ బోర్డుకు లేదు. ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని, ఈసారి ఆ సంస్థల్లో ప్రాక్టికల్‌ కేంద్రాలను పూర్తిగా రద్దు చేశారు. ఆ విద్యార్థులు ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లోనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రభుత్వ-ప్రైవేట్‌ కళాశాలలు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానమై ఉన్నందున ప్రాక్టికల్స్‌ వాటిల్లోనే నిర్వహించనున్నారు.

వివరాలు 

ఎక్కువ పరీక్షా కేంద్రాల ఏర్పాటు

వచ్చే విద్యాసంవత్సరం (2026-27) నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్‌ నిర్వహించే ప్రభుత్వ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ ఏడాదిని రిహార్సల్‌గా భావిస్తూ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదేవిధంగా, కెమెరాల నిఘా, ఫ్లయింగ్‌ స్క్వాడ్ల పర్యవేక్షణను పెంచి, ప్రాక్టికల్స్‌లో మాస్‌ కాపీయింగ్‌ వంటి అవకతవకలు జరగకుండా అడ్డుకోవాలనుకుంటున్నారు. తక్కువ రోజుల్లో పరీక్షలు పూర్తయ్యేలా ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు.