మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి: దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు కవిత లేఖ
త్వరలో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చి, ఆమోదింపజేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత కోరారు. ఈ మేరకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం 47 రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖ రాశారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా నిలిచేందుకు ఏకం కావాలని ఆమె విజ్ఞప్తి చేసారు. దేశ జనాభాలో దాదాపు 50శాతం ఉన్న మహిళలు సమాజంలో పోషిస్తున్న కీలక పాత్రను ఈ సందర్భంగా కవిత గుర్తు చేసారు. చట్టసభల్లో మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం దేశ ప్రగతికి అడ్డంకిగా మారిందన్నారు. పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి చట్టసభల్లో విభిన్న ప్రాతినిధ్యం అవసరమని కవిత నొక్కిచెప్పారు.
రాజకీయ పార్టీల్లో కొరవడిన నిబద్ధత: కవిత
రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడం వల్ల మహిళలకు సాధికారత కల్పించడమే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది బాలికలకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తుందని కవిత అన్నారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడం వల్ల సమర్థవంతమైన విధానాలను రూపొందించడానికి దారితీస్తుందన్నారు. మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో రాజకీయ పార్టీల్లో నిబద్ధత కొరవడిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్లో ఉందని ఆమె గుర్తు చేశారు.