UttarPradesh: ప్రవేట్ స్కూల్ టీచర్ దాష్టీకం.. వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్ధి
పూర్వకాలంలో గురు కులాలు ఉన్న రోజుల్లో విద్యార్ధులు గురువు బంధానికి విలువ ఉండేది. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో ప్రభుత్వ పాఠశాలలకు బదులు ప్రవేట్ స్కూళ్లు వచ్చాయి.ఇంత వరకు పర్వాలేదు. ఉత్తర్ప్రదేశ్ బలియాలోని ఓ ప్రవేట్ స్కూల్ టీచర్ రాఘవేంద్ర,ప్రతీక్ అనే ఓ పదో తరగతి విద్యార్ధిని ఈ నెల 13న చితక్కొట్టాడు. దీంతో ఆ విద్యార్ధికి వినికిడి శక్తి కోల్పోయాడు. ఇంతకీ ఆ విద్యార్ధి చేసిన తప్పేమిటంటే , తోటి విద్యార్ధితో మాట్లాడటమే. ఆ లెక్కల టీచర్ కు ఆగ్రహం తెప్పించింది. పైకి లేవమని ఎడా పెడా బాదేశాడు. 14ఏళ్ల సున్నితమైన ప్రతీక్ .. టీచర్ దెబ్బలకు తాళ లేక సొమ్మసిల్లాడు. అప్పటి నుంచి ప్రతీక్ స్కూల్ కు వెళ్లడం మానేశాడు.
ప్రతీక్ కు కుడి చెవి వినికిడి సమస్య
దీంతో కంగారు పడిన ప్రతీక్ తండ్రి ప్రవీణ్ కుమార్ మధుకర్ స్కూల్ కు వెళ్లడం లేదని నిలదీశాడు. ఇదిలా ఉంటే జరిగిన సంగతిని పూస గుచ్చినట్లు తండ్రికి చెప్పి భోరున ఏడ్చేశాడు ప్రతీక్. దీంతో షాక్ అయిన ప్రవీణ్ కుమార్ తన కుమారుడ్ని ఓదార్చాడు. అయితే టీచర్ కొట్టిన దెబ్బలకు తన ప్రతీక్ కు కుడి చెవి వినికిడి సమస్య వచ్చిందని కొంత ఆలస్యంగా గ్రహించాడు. ఈ విషయమై ప్రవీణ్ కుమార్ కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన కుమారుడి బంగారు భవిష్యత్తును చిదిమేసిన టీచర్ రాఘవేంద్రపై..స్ధానిక ఉభాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
భారతీయ శిక్షాస్మృతి కింద టీచర్ పై కేసు
దీనిపై అకారణంగా దాడి (323) , గాయపరచడం (325)సంబంధిత సెక్షన్ ల ప్రకారం భారతీయ శిక్షాస్మృతి కింద కేసు నమోదైంది. విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఉభాన్ స్టేషన్ ఆఫీసర్ తెలిపారు.