
Uttar Pradesh: అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న యువతిని నరికి చంపిన నిందితులు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh)లో ఘోరం జరిగింది. అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న 19 ఏళ్ల యువతిని దారుణంగా నరికి చంపారు.
ఈ అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన నిందితుడు, అతని సోదరుడు ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హంతకులను అశోక్, పవన్ నిషాద్గా గుర్తించారు.
కౌశాంబి జిల్లాలోని మహేవాఘాట్ సమీపంలోని ధేర్హా గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
యువతిని చంపిన నిందుతుడు ఇటీవలే బెయిల్పై విడుదలైనట్లు ఎస్పీ తెలిపారు.
ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పవన్, అశోక్ నిషాద్ పరారీలో ఉన్నారు.
యూపీ
కుటుంబ సభ్యులు చూస్తుండగానే హత్య
యువతి, ఆమె కుటుంబం పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో.. దారిలో నిందుతుడు, అతని సోదరుడు మారణాయుధాలతో వారిపై దాడి చేశారు.
ఈ క్రమంలో కుటుంబ సభ్యులు చూస్తుండగానే యువతిని గొడ్డలితో యువతిని నరికి చంపారు.
మూడేళ్ల క్రితం యువతి మైనర్గా ఉన్నప్పుడు పవన్ నిషాద్ ఆమె అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు పవన్ నిషాద్పై కేసు నమోదు కాగా.. పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఈ క్రమంలో పవన్ తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని యువతిని వేధించడం మొదలుపెట్టాడు.
దానికి ఆ యువతి ఒప్పుకోకపవడంతో.. చివరికి తన సోదరుడితో కలిసి పవన్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.