Air India: వాస్తవాలను తెలుసుకోవడానికి ఎవరినైనా విచారిస్తాం : ఏఏఐబీ
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద కేసులో పైలట్ మేనల్లుడికి 'విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో' (AAIB) సమన్లు జారీ చేసిన విషయంలో భారత పైలట్ల సమాఖ్య (FIP) గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పైలట్ల సమాఖ్య ఈ సమన్లను ఖండిస్తూ ఏఏఐబీకి లీగల్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఏఏఐబీ అధికారులు స్పందిస్తూ, విమాన ప్రమాదాల దర్యాప్తు విషయంలో చట్టప్రకారంగానే వ్యవహరిస్తున్నామని తెలిపారు. ప్రమాదంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసే సమయంలో వాస్తవాలను తెలుసుకోవడానికి అన్ని వివరాలను పరిశీలించాల్సి ఉంటుందన్నారు. అందుకు అవసరమైతే ఎవరినైనా, ఎన్ని సార్లు అయినా విచారించవచ్చని, ఇవి ఎలాంటి వేధింపుల కిందకు రాకూడదని స్పష్టం చేశారు.
Details
ఏఏఐబీ సమన్లు జారీ
గతేడాది జూన్ 12న అహ్మదాబాద్లోని ఈ ఎయిర్ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో కెప్టెన్ సుమిత్ సభర్వాల్, కో-పైలట్ క్లైవ్ కుందర్ కూడా ఉన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా సుమిత్ సభర్వాల్ మేనల్లుడు కెప్టెన్ వరుణ్ ఆనంద్కు AAIB సమన్లు జారీ చేశారు. జనవరి 15న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఎయిరిండియాలో పైలట్గా పనిచేస్తున్న వరుణ్ ఆనంద్ భారత పైలట్ల సమాఖ్య సభ్యుడిగా ఉన్నారు. FIP ఈ నోటీసులను పూర్తి అనవసరమైన చర్యగా పేర్కొంది. ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేని కెప్టెన్ వరుణ్ ఆనంద్ను పిలవడమంటే వేధింపులకు పాల్పడటం, మానసిక క్షోభకు గురిచేయడమే అని పైలట్ల సమాఖ్య నోటీసులో పేర్కొంది.