Rain Alert: ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్.. ఉత్తరాంధ్రలో రెండు రోజులు వర్షాలు!
ఈ వార్తాకథనం ఏంటి
వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆదివారం, సోమవారం పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే సముద్రం అలజడిగా మారి అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
వివరాలు
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దు
ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని స్పష్టం చేసింది.
ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది.
అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.
వివరాలు
అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అనిత
తీర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తీర ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని అనిత తెలిపారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ.. అవసరమైన చోట సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.