Loading...
Nepal's flash floods: భూకంపం కాదు.. హిమానీనదమేనా? నేపాల్ వరదల వెనుక అసలు కారణం ఇదే!
భూకంపం కాదు.. హిమానీనదమేనా? నేపాల్ వరదల వెనుక అసలు కారణం ఇదే!

Nepal's flash floods: భూకంపం కాదు.. హిమానీనదమేనా? నేపాల్ వరదల వెనుక అసలు కారణం ఇదే!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 27, 2026
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు ప్రాంతాన్ని బుధవారం (ఆగస్టు 26) భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఒక్కసారిగా ఉప్పొంగిన నీరు, మట్టి, బండరాళ్లు పెద్ద ఎత్తున దూసుకురావడంతో రహదారులు, వంతెనలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు 105 మంది భారతీయులతో సహా మొత్తం 341 మంది విదేశీయుల ఆచూకీ తెలియడం లేదు. వరదల సమయంలో అక్కడే ఉన్న నేపాలీ కార్మికుడు వివేక్ కుమాల్ తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఘటన తీవ్రతను వివరించాడు. బుధవారం ఓ కొత్తగా నిర్మించిన ఇంటి బయట మరుగుదొడ్డి కోసం గుంత తవ్వుతుండగా ఒక్కసారిగా భారీగా నీరు, మట్టి, రాళ్లు తనవైపు దూసుకొచ్చాయని చెప్పాడు.

వివరాలు

నదీ ప్రవాహ మార్గమే పూర్తిగా మారిపోయింది..

''భూకంపం వచ్చినట్టుగా నీటి గోడ భీకర శబ్దంతో దూసుకొచ్చింది'' అని అతడు తెలిపాడు.

ఆ ప్రవాహం తనతోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రతిదానినీ ఈడ్చుకెళ్లిందని వివరించాడు.

వరదల అనంతరం అక్కడి పరిస్థితికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు విధ్వంస తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి.

ముఖ్యంగా నదీ వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. భోటే కోశి నది పలు ప్రాంతాల్లో గతంలో ఉన్న ప్రవాహ మార్గం కంటే చాలా వెడల్పుగా మారినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది.

వరద నీరు పాత కాలువను దాటి లోయ ప్రాంతాల్లోకి ప్రవహించడంతో కొత్త మార్గాలను సైతం ఏర్పరచుకుంది.

స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 8.30 గంటలకు ల్హెండే ఖోలా, భోటే కోశి నదీ వ్యవస్థలో ఒక్కసారిగా వరద ఉప్పొంగింది.

వివరాలు

341 మంది విదేశీయులు సహా 750 మందికి పైగా గల్లంతు..

మార్గంలో ఎదురైన ఏ వస్తువునూ వదలకుండా నీటి ప్రవాహం తన వెంట తీసుకెళ్లింది.

ఇళ్లు, రహదారులు, వంతెనలు.. ఏవీ ఆ ప్రవాహం ధాటికి నిలబడలేకపోయాయి.

భారీ వరదతో పాటు కొండచరియలు విరిగిపడటంతో నేపాల్-టిబెట్ మధ్య కీలక రాకపోకల కేంద్రంగా ఉన్న గ్యిరాంగ్ పోర్ట్ తీవ్రంగా దెబ్బతింది.

విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా తెగిపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 160 మంది మరణించగా.. 341 మంది విదేశీయులు సహా 750 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు

''మట్టి ప్రవాహం మా వైపే దూసుకొచ్చింది''

వరద బీభత్సాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొన్న 68 ఏళ్ల కేశవ్ ప్రసాద్ బరాల్ భయానక పరిస్థితిని వివరించారు.

''భారీగా మట్టి ఒక్కసారిగా మా వైపు దూసుకొచ్చింది. అది దగ్గరపడే కొద్దీ మరింత ఎత్తుకు పెరుగుతూ వచ్చింది'' అని ఆయన తెలిపారు.

''ఆ మట్టి మా ఇంట్లోకి ప్రవేశించడాన్ని చూసిన వెంటనే నా భార్య చేయి పట్టుకుని ఆమెను ఇంటి పైకప్పుపైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాను.

కానీ అంతలోనే మట్టి ప్రవాహం ఆమెను తనతోపాటు కొట్టుకుపోయింది'' అని బరాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

వరదల కారణంగా భవనాలదిగువ అంతస్తులు పూర్తిగా బురదలో కూరుకుపోయాయి.

సహాయక బృందాలు మట్టి, బురదలోనే వెతుకులాట కొనసాగిస్తూ ప్రాణాలతో ఉన్నవారి కోసం గాలిస్తున్నాయి. భారీ స్థాయిలో గాలింపు, సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

ఇంతటి ఆకస్మిక వరదలకు కారణమేంటి?

ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ.. ఈ విపత్తుకు అసలు కారణం ఏమిటన్న దానిపై చర్చ మొదలైంది.

తొలుత నేపాల్‌లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని, దాని కారణంగానే ఆకస్మిక వరదలు వచ్చాయని వార్తలు వెలువడ్డాయి.

టిబెట్-నేపాల్ సరిహద్దులో కొండచరియలు విరిగిపడటానికి కొద్దిసేపటి ముందు భూకంపం సంభవించిందని నేపాల్ విదేశాంగ మంత్రి పేర్కొన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

దీంతో భూకంపం కారణంగానే ఈ విపత్తు సంభవించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ఈ భూకంపం వాదనను తోసిపుచ్చింది.

అక్కడ నమోదైన భూకంప కార్యకలాపం వాస్తవానికి భూకంపం కాదని.. హిమానీనదం కూలిపోవడం, దాని కారణంగా భారీగా శిథిలాలు కిందికి ప్రవహించడమేనని స్పష్టం చేసింది.

వివరాలు

హిమానీనదం-రాళ్ల కుప్ప కూలడమే కారణమా?

హిమానీనదం కూలిపోవడంతో ఏర్పడిన భారీ శిథిల ప్రవాహం దిగువ ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసానికి కారణమైందని USGS తెలిపింది.

నేపాల్‌లోని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీలో భూగర్భ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ప్రకాశ్ పోఖ్రెల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన అనంతరం ఆయన రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. నేపాల్ వైపు సంభవించిన మంచు-రాళ్ల భారీ కుప్ప కూలిపోవడం (ఐస్-రాక్ అవలాంచ్) కారణంగానే ఈ ఆకస్మిక వరదలు వచ్చాయని పేర్కొన్నారు.

కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీకి చెందిన భూగర్భ శాస్త్రవేత్త డేనియల్ షుగర్ కూడా ఇదే విశ్లేషణతో ఏకీభవించారు.

వివరాలు

భౌగోళిక ఆధారాలు ఏం చెబుతున్నాయంటే..

ఓ న్యూయార్క్ టైమ్స్ కథనంలో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆ ప్రాంతంలోని ఓ హిమానీనదం ఒకేసారి పెద్ద భాగంగా తెగిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

అది దాదాపు ఒక కిలోమీటరు కంటే ఎక్కువ నిలువు ఎత్తు నుంచి లోయ అడుగు భాగంలోకి పడిపోయినట్లు కనిపిస్తోందని ఆయన విశ్లేషించారు.

అందువల్ల నేపాల్‌లో సంభవించిన ఈ భారీ విపత్తుకు భూకంపం కంటే హిమానీనదం కూలిపోవడం, దాని వెంట మంచు-రాళ్లు, మట్టి భారీగా దిగువకు దూసుకురావడం ప్రధాన కారణమని ప్రస్తుత భౌగోళిక ఆధారాలు సూచిస్తున్నాయి.

ADVERTISEMENT