Suitcase Torso Case: మహిళను చంపి.. శరీర భాగాలతో బిరియానీ.. చెన్నై కేసులో కీలక ఆధారాలు లభ్యం
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నైలో సంచలనం రేపిన రైలు సూట్కేస్లో మహిళ మొండెం కేసులో దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 5న ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్లో రైలులోని రిజర్వేషన్ లేని బోగీలో ఎర్రటి ట్రాలీ సూట్కేస్లో మహిళ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో మృతురాలిని తమిళనాడుకు చెందిన హైదుల్ నిషాగా గుర్తించారు. హైదుల్ నిషాను నిందితులు అక్కడే హత్య చేసిన అనంతరం.. మృతదేహంలోని కొన్ని శరీర భాగాలతో బిరియానీ వండి, మిగిలిన భాగాలను సూట్కేసులో పెట్టి తమిళనాడు ఎక్స్ప్రెస్లో తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
వివరాలు
350కి పైగా సీసీటీవీ ఫుటేజీల పరిశీలన
కేసును ఛేదించేందుకు చెన్నై సెంట్రల్ నుంచి కూడువాంచేరి వరకు పోలీసులు 350కి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
ఈ క్రమంలో సూట్కేసుతో ఓ వ్యక్తి, మహిళ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కు వచ్చిన దృశ్యాలను గుర్తించారు.
ఆ ఇద్దరూ సూట్కేస్ను తమిళనాడు ఎక్స్ప్రెస్లోని జనరల్ బోగీలో ఉంచిన అనంతరం రైలు నుంచి దిగిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా అనుమానిత జంట కూడువాంచేరిలోని ఓ అద్దె ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన సమయంలో మానవ రక్తపు ఆనవాళ్లు ఉన్న పాత్ర లభించినట్లు సమాచారం.
ఈ కేసులో మాణిక్ ఉద్దీన్ లస్కర్, అతని భార్య భగ్మతి మాజిక్ పేర్లు అనుమానితులుగా వెలుగులోకి వచ్చాయి.
వివరాలు
ముమ్మరంగా కొనసాగుతున్న ధర్యాప్తు
మరోవైపు ఉద్దీన్ లస్కర్, భగ్మతి మాజిక్ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఒడిశా వైపు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
దీంతో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఒడిశాకు పంపినట్లు తెలుస్తోంది.
ఇప్పటికీ మృతదేహానికి సంబంధించిన తల, చేతులు పోలీసులకు లభించాల్సి ఉంది.
అసలు హత్యకు కారణం ఏమిటి? హైదుల్ నిషాను ఎందుకు హత్య చేశారు? మృతదేహాన్ని ముక్కలుగా చేసి రైలులో ఎందుకు తరలించారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.