BRICS Summit: ప్రపంచ నేతలకు భారతీయ రుచులు.. బ్రిక్స్ సదస్సు కోసం ప్రత్యేక వంటకాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ ఈ వారాంతంలో 18వ బ్రిక్స్ నేతల సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. దేశ రాజధానిలోని భారత్ మండపంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల నేతలతో పాటు ఆహ్వానితులు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ ఎల్-సిసీ తదితర ప్రపంచ నేతలు సదస్సుకు హాజరవుతున్నారు. పుతిన్ ఇప్పటికే న్యూదిల్లీకి చేరుకున్నారు.
వివరాలు
విభిన్నమైన వంటకాలను సిద్ధం చేస్తున్న హోటళ్ల చెఫ్లు
ప్రపంచ నేతలు, వారి జీవిత భాగస్వాములు, దౌత్యవేత్తలు, వ్యాపార ప్రతినిధుల కోసం ఢిల్లీలోని విలాసవంతమైన హోటళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ముఖ్యంగా ఆహార మెనూలను భారతీయ సంస్కృతి, సంప్రదాయ రుచులకు అనుగుణంగా రూపొందించారు.
అతిథులకు దేశీయ వంటకాల ప్రత్యేకతను పరిచయం చేసేందుకు హోటళ్ల చెఫ్లు విభిన్నమైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు.
ఎన్డీటీవీ నివేదిక ప్రకారం.. కశ్మీర్ మసాలా వాల్నట్స్, గలౌటీ కబాబ్ల నుంచి గులాబీ, కుంకుమపువ్వు, యాలకులతో తయారుచేసిన తినదగిన తామర వరకు ఈ మెనూలో ప్రత్యేక వంటకాలు ఉండనున్నాయి.
ఢిల్లీలోని తాజ్ మహల్, ది లీలా ప్యాలెస్, ది లలిత్ హోటళ్లు భారతీయ వంటకాలను ఆధునిక, అంతర్జాతీయ రుచులతో కలిపి అతిథులకు అందించనున్నాయి.
వివరాలు
తాజ్ మహల్ హోటల్లో 'ట్రెడిషన్ టు టేబుల్'
తాజ్ మహల్ హోటల్ వీఐపీ అతిథులకు 'ట్రెడిషన్ టు టేబుల్' పేరుతో ప్రత్యేక ఆహార అనుభవాన్ని అందించనుంది.
తమకు వంటలు నేర్పిన తల్లుల వంటకాల నుంచి స్ఫూర్తి పొంది తాజ్ చెఫ్లు ఈ ప్రత్యేక మెనూను రూపొందించారు.
భారతీయ ఆతిథ్య స్ఫూర్తిని, సంప్రదాయ వంటకాల ప్రత్యేకతను ప్రపంచ నేతలకు పరిచయం చేయడం దీని ఉద్దేశం.
ఎన్డీటీవీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మెనూలో కశ్మీర్ మసాలా వాల్నట్స్, పురానీ ఢిల్లీ మైదా కాజు, మహారాష్ట్ర భాకర్వడీ, రాజస్థాన్ మినీ కచోరీ, బెంగాల్ కుచో నిమ్కీ, తమిళనాడు మురుక్కు వంటి వంటకాలు ఉండనున్నాయి.
వివరాలు
మెనూలో ప్రత్యేక ఆకర్షణగా తినే తామర
''భారతీయ వంటకాల వైవిధ్యం, గొప్ప సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రత్యేక బహుమతిని రూపొందించాం. తాజ్ ఆతిథ్యానికి ప్రతీకగా నిలిచే ఆప్యాయత, శ్రద్ధ, అనుబంధ స్ఫూర్తిని ఇది చాటుతుంది'' అని తాజ్ మహల్ న్యూదిల్లీ ఏరియా డైరెక్టర్-ఆపరేషన్స్, జనరల్ మేనేజర్ డాక్టర్ అన్మోల్ అహ్లువాలియా ఎన్డీటీవీకి తెలిపారు.
బ్రిక్స్ సదస్సు కోసం ది లీలా ప్యాలెస్ కూడా ప్రత్యేక మెనూను సిద్ధం చేసింది.
భారతీయ సంప్రదాయాలను ఆధునిక వంటకాలతో మేళవిస్తూ అతిథులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది.
ఇందులో చేతితో తయారుచేసిన తినదగిన తామర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
వివరాలు
బ్రిక్స్ అతిథుల కోసం తినదగిన తామర.. మిల్లెట్ వంటకాలు
భారత జాతీయ పుష్పమైన తామరను ప్రత్యేక అర్థంతో ఈ మెనూలో చేర్చారు.
బ్రిక్స్ ఇండియా 2026 గుర్తింపులోనూ, భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తులోనూ తామర ప్రతిబింబిస్తుండటం గమనార్హం.
గులాబీ, కుంకుమపువ్వు, యాలకులతో ఈ తినదగిన తామరను తయారుచేసి, దేశీయ పండ్లతో కలిపి అందించనున్నారు.
దీనితో పాటు ది లీలా 'ఔజస్య' పేరుతో మిల్లెట్ కుకీలు,చేతితో తయారుచేసిన గ్రానోలా బార్లు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన పానీయాలను కూడా అందించనుంది.
భారతీయ పదార్థాలను ఆధునిక ఆహార విధానంతో కలిపి ఈ వంటకాలను రూపొందించినట్లు ది లీలా ప్యాలెస్ న్యూదిల్లీ ఎగ్జిక్యూటివ్ చెఫ్ కరణ్ ఠాకూర్ తెలిపారు.
'ఔజస్య బై ది లీలా'మిల్లెట్ కుకీలు ఆ హోటల్ గ్రూప్ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమంలో భాగం.
వివరాలు
సంప్రదాయ ధాన్యాలతో ఆరోగ్యకరమైన మెనూ
ఆహారం,పోషకాహార నిపుణురాలు డాక్టర్ అంకిత జలోరీ సహకారంతో దీన్ని ప్రారంభించారు.
శరీరానికి పోషణ అందించే 'రిస్టోర్', మానసిక ప్రశాంతత,అవగాహనకు సంబంధించిన 'రివ్యూ' అనే భావనలపై ఈ మెనూ ఆధారపడి ఉంటుంది.
భద్రతా ఏర్పాట్లు,స్వాగత కార్యక్రమాలు,ప్రత్యేక మెనూలను సిద్ధం చేస్తున్నామని ది లీలా ప్యాలెస్ జనరల్ మేనేజర్ ప్రీతి మఖీజా తెలిపారు.
ఐదు దేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆహ్వానించేందుకు హోటల్ సిబ్బంది సన్నద్ధమవుతున్నారని చెప్పారు.
భద్రత నుంచి రిసెప్షన్ స్వాగతం వరకు అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.
ఈ మెనూలో బార్లీ,మిల్లెట్, జొన్నలు,సత్తు వంటి సంప్రదాయ ధాన్యాలు, భారతీయ మసాలాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
హోటల్లోని రెస్టారెంట్లు, గదుల్లో అందించే ఆహారంలోనూ భారతీయ రెస్టారెంట్ 'జమావర్'కు చెందిన ప్రత్యేక వంటకాలు ఉండనున్నాయి.
వివరాలు
గలౌటీ కబాబ్లతో ది లలిత్ ప్రత్యేక విందు
ది లలిత్ హోటల్ కూడా బ్రిక్స్ అతిథుల కోసం ప్రత్యేక మెనూను రూపొందించింది. భారతీయ ప్రాంతీయ వంటకాల వైవిధ్యాన్ని చాటేలా ఈ మెనూను సిద్ధం చేశారు.
సంప్రదాయ విందుల్లో కనిపించే వంటకాలకు భిన్నంగా, ప్రసిద్ధ వంటకాలను ఆధునిక పద్ధతిలో అందించనున్నారు.
ఈ మెనూలో గలౌటీ కబాబ్లు, తందూరులో కాల్చిన రొట్టెలతో పాటు మిల్లెట్ ఆధారిత వంటకాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
భారతీయ పోషకాహార సంప్రదాయాలను, ఆధునిక వంటల అవకాశాలను ఈ వంటకాలు ప్రతిబింబించనున్నాయి.
వివరాలు
గలౌటీ కబాబ్లతో ది లలిత్ ప్రత్యేక విందు
గలౌటీ లేదా గలావతి కబాబ్ అవధీ వంటకాల్లో ప్రసిద్ధి చెందిన కబాబ్.
మాంసంతో తయారుచేసే ఈ వంటకం నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉంటుంది. లఖ్నవూకు చెందిన ఓ నవాబు కోసం దీన్ని తొలుత తయారుచేశారని చెబుతారు.
ది లలిత్ మెనూలో కొన్ని ప్రత్యేక వంటకాలను కూడా చెఫ్లు రూపొందించారు.
మిసో పేస్ట్తో వండిన వంకాయ, మెల్లగా ఉడికించిన చైనీస్ క్యాబేజీ, అంబర్ సాస్తో జపాన్ శైలిలో తయారుచేసిన కిడ్నీ బీన్ స్వీట్ వంటి వంటకాలు కూడా ఇందులో ఉన్నట్లు ఎన్డీటీవీ నివేదించింది.
వివరాలు
సెప్టెంబర్ 12, 13 తేదీల్లో సదస్సు కార్యక్రమాలు
బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12న మధ్యాహ్నం 2 గంటలకు భారత్ మండపంలో నేతల రాకతో ప్రారంభమవుతుంది.
అనంతరం సభ్య దేశాల నేతలతో అంతర్గత సమావేశం, గ్రూప్ ఫొటో కార్యక్రమాలు ఉంటాయి.
అదే రోజు రాత్రి 7.30 గంటలకు భారత్ మండపంలో ప్రధాన మంత్రి ఆతిథ్యమిచ్చే విందు జరగనుంది.
సెప్టెంబర్ 13న ఉదయం 10 గంటలకు సదస్సు తిరిగి ప్రారంభమవుతుంది.
వివరాలు
బ్రిక్స్ సదస్సు 2026 పూర్తి కార్యక్రమ వివరాలు
శనివారం, సెప్టెంబర్ 12, 2026
మధ్యాహ్నం 2 గంటలు: బ్రిక్స్ సభ్య దేశాల నేతల రాక వేదిక: భారత్ మండపం, లెవల్ 2
అంశం: సమ్మిళిత ప్రపంచ పాలన, బహుళపక్ష విధానాన్ని బలోపేతం చేయడం
వేదిక: సమ్మిట్ హాల్, లెవల్ 2, భారత్ మండపం
సాయంత్రం 4.25 గంటలు: 'భారత్ ఇన్నోవేట్స్' ప్రదర్శన సందర్శన వేదిక: హాల్ 14, భారత్ మండపం
సాయంత్రం 5.05 గంటలు: గ్రూప్ ఫొటో వేదిక: భారత్ మండపం వెలుపలి లాన్
సాయంత్రం 5.10 గంటలు: సంయుక్తంగా మొక్కలు నాటే కార్యక్రమం వేదిక: భారత్ మండపం వెలుపలి లాన్
రాత్రి 7.30 గంటలు: ప్రధాన మంత్రి ఆతిథ్యమిచ్చే విందు వేదిక: భారత్ మండపం, లెవల్ 3
వివరాలు
ఆదివారం, సెప్టెంబర్ 13, 2026
ఉదయం 9.55 గంటలు: బ్రిక్స్ భాగస్వామ్య దేశాలు, ఆహ్వానిత దేశాల నేతల రాక వేదిక: భారత్ మండపం, లెవల్ 2
ఉదయం 10.35 గంటలు: గ్రూప్ ఫొటో వేదిక: భారత్ మండపం, లెవల్ 2
ఉదయం 10.50 గంటలు: బహిరంగ సమావేశం అంశం: స్థిరత్వం, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరతతో సమ్మిళిత ప్రపంచ వృద్ధికి భవిష్యత్తును తీర్చిదిద్దడం వేదిక: సమ్మిట్ హాల్, లెవల్ 2, భారత్ మండపం