Loading...
Bonalu 2026: బోనాల ఆచారం..వెల్లివిరిసే సంబరం..
బోనాల ఆచారం..వెల్లివిరిసే సంబరం..

Bonalu 2026: బోనాల ఆచారం..వెల్లివిరిసే సంబరం..

వ్రాసిన వారు Moogati Shabari
Jul 16, 2026
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. మన పండుగల్లో చాలా వరకు ప్రకృతి ఆరాధనకు ప్రతీకలుగా నిలుస్తాయి. అలాంటి పండుగల్లో బోనాలు కూడా ఒకటి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా గ్రామదేవతలకు బోనం సమర్పిస్తూ భక్తులు ఈ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. దక్షిణాయన ప్రారంభ సమయంలో జరిగే ఈ ఉత్సవాలు ప్రకృతి ఆరాధనతో పాటు శక్తి పూజకు ప్రతీకగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోటలో ఉన్న జగదాంబ మహంకాళి ఆలయంలో ఆషాఢ మాసం తొలి గురువారం నుంచి బోనాల వేడుకలు ప్రారంభమవుతాయి. ఆషాఢమాసం మొత్తం ప్రతి గురువారం, ఆదివారం ఆలయంలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు.

వివరాలు

అమ్మవారికి కృతజ్ఞతగా చేసే పండుగ..

'బోనం' అంటే అమ్మవారికి భోజనం సమర్పించడం. సమస్త జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించే అమ్మవారికి కృతజ్ఞతగా భక్తులు ప్రతి సంవత్సరం బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

ఆషాఢ మాసం రాగానే తెలంగాణలోని గ్రామదేవతల ఆలయాలు కొత్త శోభను సంతరించుకుంటాయి.

గోల్కొండ మహంకాళి ఆలయంతో పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, శాలిబండ అక్కన్న-మాదన్న ఆలయం, లాల్‌దర్వాజా సింహవాహిని ఆలయం తదితర దేవాలయాల్లో బోనాల సంబరాలు అట్టహాసంగా జరుగుతాయి.

బోనాలఉత్సవాల్లో ఘటోత్సవానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

కలశంలో అమ్మవారిని ఆహ్వానిస్తూ పూర్ణకుంభంతో స్వాగతం పలకడం వేడుకలో ప్రధాన ఘట్టంగా భావిస్తారు.

అమ్మవారికి కలశంతో స్వాగతం పలకడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సిద్ధం చేసి ఫలహార బండిలో ఆలయానికి తీసుకెళ్లి సమర్పిస్తారు.

వివరాలు

కుండకు సున్నం పూసి వేపకొమ్మలతో అలంకరణ..

కొత్త మట్టికుండలో బియ్యం, పసుపు, బెల్లం, పాలు వేసి వండి, ఆ కుండకు సున్నం పూసి వేపకొమ్మలు అలంకరిస్తారు.

అనంతరం మహిళలు ఆ బోనాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు.

ఈ వేడుకల్లో పోతురాజుల విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

బోనాల ఉత్సవాల చివరి రోజుల్లో నిర్వహించే 'రంగం' కార్యక్రమానికి కూడా భారీగా భక్తులు హాజరవుతారు.

చరిత్రను పరిశీలిస్తే కాకతీయుల కాలం నుంచే బోనాల ఉత్సవాలు నిర్వహించబడుతున్నట్లు తెలుస్తోంది.

అప్పట్లో కాకతి దేవతకు అన్నాన్ని కుంభంలో నింపి నైవేద్యంగా సమర్పించేవారని చెబుతారు.

అనంతరం గోల్కొండ నవాబుల కాలంలో ఈ ఉత్సవాలు మరింత ప్రాచుర్యం పొందాయి.

ADVERTISEMENT