IIT Madras: విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ గుడ్న్యూస్.. రూ.500తో 17 రంగాల్లో ఆన్లైన్ కోర్సులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు ప్రఖ్యాత ఐఐటీ మద్రాస్ (IIT Madras) కీలక అవకాశం కల్పిస్తోంది. విద్యార్థులు స్కూల్ దశలోనే వివిధ అధునాతన రంగాలపై అవగాహన పెంచుకునేలా ఎనిమిది వారాల ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తోంది. ఒక్కో కోర్సుకు కేవలం రూ.500 నామమాత్రపు రుసుం మాత్రమే వసూలు చేస్తోంది. డేటా సైన్స్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వంటి ఆధునిక అంశాలను ఇందులో నేర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ అవకాశం ఐఐటీ మద్రాస్తో భాగస్వామ్యంగా నమోదైన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. 9, 10, 11, 12వ తరగతుల విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరవచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
వివరాలు
సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు..
అక్టోబర్లో ప్రారంభం కానున్న ఈ కోర్సులకు ఐఐటీ మద్రాస్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.( కోర్సులు అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతాయి.
'స్కూల్ కనెక్ట్' కార్యక్రమం ద్వారా ఐఐటీ మద్రాస్ ఇప్పటికే భారీ సంఖ్యలో పాఠశాలలతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది.
దేశం వెలుపల ఉన్న 60కి పైగా పాఠశాలలు సహా మొత్తం 4,900కు పైగా స్కూల్స్ ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నాయి.
ఇప్పటివరకు 1.75 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారు.
రాబోయే కొన్నేళ్లలో 'స్కూల్ కనెక్ట్'ను 25 వేల పాఠశాలలకు విస్తరించాలని ఐఐటీ మద్రాస్ CODE (Centre for Outreach and Digital Education) లక్ష్యంగా పెట్టుకుంది.
వివరాలు
విద్యార్థుల్లో అవగాహన పెంచడమే లక్ష్యం..
భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన విద్యాపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు విద్యార్థులు వివిధ రంగాలను తెలుసుకుని, వాటిపై అవగాహన పెంచుకునే అవకాశం కల్పించడమే 'స్కూల్ కనెక్ట్' ప్రధాన ఉద్దేశమని ఐఐటీ మద్రాస్ తెలిపింది.
పాఠశాల విద్యకు, ఉన్నత విద్యకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమూ ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాల్లో ఒకటని పేర్కొంది.
ఈ ఏడాది నుంచి 9వ తరగతి విద్యార్థులను కూడా కోర్సుల్లోకి ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఐఐటీ మద్రాస్ వెల్లడించింది.
చిన్న వయసులోనే వివిధ రంగాలపై అవగాహన కల్పిస్తే విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించేందుకు వీలవుతుందని తెలిపింది.
తద్వారా భవిష్యత్తులో చదువు, కెరీర్కు సంబంధించిన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.
వివరాలు
17 విభాగాల్లో కోర్సులు..
దేశవ్యాప్తంగా 25 వేల పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందించాలన్నదే తమ లక్ష్యమని ఐఐటీ మద్రాస్ అధికారిక వెబ్సైట్లో(https://www.iitm.ac.in/) వెల్లడించింది.
'స్కూల్ కనెక్ట్'లో భాగంగా మొత్తం 17 విభిన్న రంగాలకు సంబంధించిన ముఖ్యమైన కోర్సులను ఐఐటీ మద్రాస్ అందిస్తోంది.
డేటా సైన్స్ అండ్ ఏఐ, ఏరోస్పేస్, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, కెమికల్ ఇంజినీరింగ్, మాలిక్యులర్ ఇంజినీరింగ్ ఇందులో ఉన్నాయి.
అలాగే ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, లా, ఎకనమిక్స్ అండ్ ఫైనాన్స్, హ్యుమానిటీస్, ఎకాలజీ, డిజిటల్ హ్యుమానిటీస్, గేమ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇంజినీరింగ్ బయోలాజికల్ సిస్టమ్స్ వంటి విభాగాల్లోనూ విద్యార్థులు కోర్సులు చేసుకోవచ్చు.
వివరాలు
రికార్డెడ్ వీడియోలు.. లైవ్ సెషన్లు..
ఈ కోర్సులను ఐఐటీ మద్రాస్తో పాటు ఇతర ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన అధ్యాపకులు రూపొందించి బోధిస్తారు.
ఒక్కో కోర్సు వ్యవధి ఎనిమిది వారాలు. కోర్సులో భాగంగా ముందుగా రికార్డు చేసిన ప్రసంగాలు, వీడియో కంటెంట్తో పాటు లైవ్ సెషన్లు నిర్వహిస్తారు.
విద్యార్థులకు అసైన్మెంట్లు, కంప్యూటర్ ఆధారిత అసెస్మెంట్లు కూడా ఉంటాయి.
నిర్దేశించిన కోర్సు అంశాలను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఎనిమిది వారాల ఆన్లైన్ కోర్సు పూర్తయిన అనంతరం ఈ-సర్టిఫికెట్ అందజేస్తారు.
అంతేకాదు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సన్మానించనున్నారు.
వారికి ఐఐటీ మద్రాస్ క్యాంపస్ను సందర్శించే అవకాశం కూడా కల్పిస్తారు. అక్కడ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు, ఇతర సభ్యులతో నేరుగా ఇంటరాక్షన్ చేసే అవకాశం ఉంటుంది.