Foods: ఈ దోసెలు మీ మనసును దోచేస్తాయి.. కర్ణాటక స్పెషల్ "ముల్బగల్ దోసెలు" తిన్నారా?
ఈ వార్తాకథనం ఏంటి
దోసె అనేది చాలా మందికి ఇష్టమైన అల్పాహారం. కానీ ఎప్పటికప్పుడు ఒకే విధంగా తింటే కొంత బోర్ అనిపించడం సహజం. అందుకే ఈరోజు మీ కోసం కాస్త భిన్నమైన, రుచికరమైన కర్ణాటక స్టైల్ "ముల్బగల్ దోసె" రెసిపీని పరిచయం చేస్తున్నాం. వీటిని "ముల్బగల్ ఘీ రోస్ట్ దోసె" అని కూడా పిలుస్తారు. ఈ దోసెలు లోపల మృదువుగా, బయట కరకరలాడే టెక్స్చర్తో ఉండి ప్రతి ముద్దా ఆస్వాదించాలనిపించేలా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ దోసెల తయారీ విధానాన్ని తెలుసుకుందాం.
వివరాలు
అవసరమైన పదార్థాలు ఇవే
ఇడ్లీ బియ్యం - 2 కప్పులు సగ్గుబియ్యం - ¼ కప్పు మినపప్పు - 1 కప్పు మెంతులు - 1 టీ స్పూన్ శనగపప్పు - 3 టేబుల్ స్పూన్లు అటుకులు - ½ కప్పు ఉప్పు - అవసరానికి సరిపడా నెయ్యి - కొద్దిగా
వివరాలు
రెడ్ చట్నీ కోసం కావాల్సిన పదార్థాలివే
ఎండుమిర్చి - 15 ఉల్లిపాయలు - 2 నూనె - 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు - కొద్దిగా చింతపండు - కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు - 7 శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
వివరాలు
తయారీ విధానం ఇదే
మొదటగా ఒక పెద్ద గిన్నెలో ఇడ్లీ బియ్యం, శనగపప్పు, మినపప్పు, మెంతులు వేసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. ఆ తరువాత సరిపడా నీళ్లు పోసి కనీసం 8 గంటల పాటు నానబెట్టాలి. అలాగే మరో గిన్నెలో సగ్గుబియ్యాన్ని కూడా నీళ్లలో వేసి అదే సమయం పాటు నానబెట్టాలి. గ్రైండ్ చేయడానికి సుమారు 15 నిమిషాల ముందు అటుకులను కొద్దిగా నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం మిశ్రమం, సగ్గుబియ్యం, అటుకులు అన్నీ మిక్సీలో వేసి తగినంత నీరు కలిపి మృదువైన పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలిపి మూతపెట్టి 8 గంటల పాటు పులియబెట్టాలి.
వివరాలు
చట్నీ తయారు చేసుకోండిలా
ముందుగా ఎండుమిర్చిని నీళ్లలో వేసి సుమారు 30 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. అందులో శనగపప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి మూడు నిమిషాల పాటు వేయించాలి. ఆ తరువాత వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మరో రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఉప్పు, నానబెట్టిన ఎండుమిర్చి, కొద్దిగా నీళ్లు జోడించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంతో చట్నీ సిద్ధం అవుతుంది.
వివరాలు
దోసె తయారీ విధానం ఇదే
పులిసిన పిండిలో ఉప్పు, కొద్దిగా నీరు వేసి దోసెకి సరిపోయే మందంతో కలపాలి. స్టవ్ మీద దోసె తవా పెట్టి వేడి చేయాలి. వేడి అయిన తర్వాత పిండిని గరిటెతో తీసుకుని దోసెలా పోయాలి. దాని మీద మూతపెట్టి ఒక నిమిషం పాటు ఆవిరి మీద ఉడికించాలి. తర్వాత మూత తీసి అంచుల చుట్టూ, మధ్యలో కొద్దిగా నెయ్యి పోయాలి. వెంటనే దోసెపై రెడ్ చట్నీని పూసి సమంగా పంచాలి. మధ్య మంటపై కొద్దిసేపు వేయించాలి. చివరగా దోసె మధ్యలో ముందుగానే తయారు చేసిన ఆలూ కుర్మా పెట్టి దోసెను మడిచి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా రుచికరమైన కర్ణాటక స్టైల్ ముల్బగల్ దోసెలు సిద్ధం!