Rakha Bhandan: రాఖీ...వేదకాలంలో భార్యాభర్తల బంధానికి ప్రతీక!
ఈ వార్తాకథనం ఏంటి
రక్షాబంధన్ అంటే వెంటనే సోదరసోదరీమణుల అనుబంధమే గుర్తుకొస్తుంది. అయితే ఈ పండుగకు వేల ఏళ్ల చరిత్ర ఉందని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా వేదకాలంలో రక్షా బంధన్కు ప్రత్యేక ప్రాధాన్యం ఉండేదని చెబుతారు. అప్పట్లో ఇది కేవలం అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధానికి మాత్రమే పరిమితం కాలేదు. భార్యాభర్తల అనుబంధానికి కూడా రక్షా బంధన్ ప్రతీకగా ఉండేదని పురాణ కథలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం.. రాక్షసులతో యుద్ధానికి బయలుదేరిన దేవలోకాధిపతి ఇంద్రుడికి ఆయన భార్య సచీదేవి రక్షణగా రాఖీ కట్టిందట. ఇంద్రుడి విజయాన్ని, క్షేమాన్ని కోరుతూ ఆమె ఈ రక్షా సూత్రాన్ని కట్టినట్లు కథనం. కాలక్రమేణా ఈ సంప్రదాయం మారుతూ వచ్చింది. ప్రస్తుతం రక్షా బంధన్ ప్రసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా జరుపుకుంటున్నారు.
వివరాలు
రాఖీ కట్టించుకునే వారికి అమరత్వం..
ఇదే సమయంలో యమధర్మరాజు, ఆయన సోదరి యమునకు సంబంధించిన మరో పురాణ కథ కూడా ఉంది.
ప్రతి శ్రావణ పౌర్ణమికి యమున తన సోదరుడు యముడికి రాఖీ కట్టేదట.
తన సోదరితో రాఖీ కట్టించుకునే వారికి అమరత్వం లభిస్తుందని యమధర్మరాజు ప్రకటించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు.
అప్పటి నుంచి మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి వారు చిరాయువుతో జీవించాలని కోరుకోవడం ఆనవాయితీగా మారిందని చెబుతారు.
సోదరులు కూడా తమ అక్కాచెల్లెళ్లకు ఆశీస్సులు అందిస్తూ తమ ప్రేమను చాటుకుంటారు.
రాఖీకి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉందని చెబుతారు. పసుపులో దారాన్ని ముంచి, దాన్ని మూడు పొరలుగా చేసి చేతికి కట్టే సంప్రదాయం ఉండేదట.
వివరాలు
అప్పటి నుంచే రక్షా బంధన్ సంప్రదాయం..
ఈ రక్షా సూత్రం చెడు, వైఫల్యాల నుంచి కాపాడుతుందని నమ్మకం. ముఖ్యంగా ఎరుపు రంగు దారం అగ్నికి ప్రతీకగా భావిస్తారు.
ఇది శక్తి, రక్షణ, భద్రతకు ప్రతీకగా పేర్కొంటారు. రాజపుత్ర వనిత, చిత్తోర్గఢ్ రాణి కర్ణావతి రాఖీ పంపిన కథ కూడా రక్షా బంధన్ చరిత్రలో ప్రముఖంగా చెప్పుకుంటారు.
గుజరాత్ పాలకుడు బహదూర్ షా దండయాత్రల నుంచి తమ రాజ్యాన్ని కాపాడాలని కోరుతూ అప్పటి ఢిల్లీ చక్రవర్తి హుమయూన్కు రాణి కర్ణావతి రాఖీ పంపినట్లు కథనం.
ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో మేవార్లో రక్షా బంధన్ సంప్రదాయం ప్రారంభమైందని, ఆ తర్వాత రాజస్థాన్ అంతటా విస్తరించిందని చెబుతారు.
వివరాలు
సోదరికి అండగా ఉంటానని హామీ..
కాలంతో పాటు రక్షా బంధన్ వేడుకల్లోనూ అనేక మార్పులు వచ్చాయి.
అయినప్పటికీ సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణకు ప్రతీకగా ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
సాధారణంగా సోదరి తన సోదరుడి కుడిచేతికి రాఖీ కడుతుంది.
రాఖీలోని దారం వారి బంధానికి ప్రతీకగా భావిస్తారు. సోదరుడిని చెడు నుంచి కాపాడాలని కోరుతూ రాఖీ కట్టడం, సోదరుడు తన సోదరికి అండగా ఉంటానని హామీ ఇవ్వడం ఈ పండుగలో ప్రధాన భావనగా కొనసాగుతోంది.