Raksha Bhandan: రాఖీ పండుగకు ఎందుకంత ప్రాముఖ్యత.. దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
రాఖీ పండుగను రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగల్లో ఇది ఒకటి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమానుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి ఏడాది శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు రాఖీ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాలకు ఈ పండుగ అద్దం పడుతుంది. రాఖీ పండుగ సందర్భంగా ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి అన్నదమ్ములకు రాఖీ కడతారు.
వివరాలు
సంప్రదాయం వెనుక అనేక పురాణ కథలు..
సోదరుడి నుదుటన తిలకం దిద్ది, రాఖీ కట్టి హారతి ఇస్తారు. సోదరులు తమ సోదరీమణులకు కానుకలు ఇచ్చి, వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు.
అక్క లేదా చెల్లెలు తన సోదరుడు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది.
సోదరుడు కూడా తన సోదరికి ఎల్లప్పుడూ అండగా ఉంటాననే భరోసా ఇస్తాడు.
అయితే రాఖీ బంధం కేవలం అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య మాత్రమే పరిమితం కాదు.
పురాణాల ప్రకారం.. ఒక స్త్రీ, పురుషుడి చేతికి కట్టే రక్షా తోరాన్ని కూడా రక్షా బంధన్గా పరిగణిస్తారు.
ఈ సంప్రదాయం వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి.
మహాభారతంలో శ్రీకృష్ణుడు, ద్రౌపదికి సంబంధించిన ఓ సంఘటనను రాఖీ సంప్రదాయంతో ముడిపెడతారు.
వివరాలు
నిస్సహాయ స్థితిలో ద్రౌపది..
పాండవులు నిర్వహించిన రాజసూయ యాగంలో శిశుపాలుడు వంద తప్పులు చేయడంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అతడిని సంహరిస్తాడు.
ఆ సమయంలో శ్రీకృష్ణుడి వేలికి గాయం కావడంతో రక్తం కారుతుంది.
అది గమనించిన ద్రౌపది వెంటనే తన చీర కొంగును చించి, శ్రీకృష్ణుడి గాయమైన వేలికి కట్టు కడుతుంది.
ద్రౌపతి చూపిన ఆప్యాయతకు కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తాడు.
మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఈ బంధం మరింత స్పష్టంగా కనిపిస్తుందని పురాణ కథనం చెబుతుంది.
సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్న సమయంలో ఆమెను రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేకపోతారు. నిస్సహాయ స్థితిలో ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తుంది.
వివరాలు
ఇంద్రుడి యుద్ధం..
శ్రీకృష్ణుడు ఆమెకు అంతులేని వస్త్రాన్ని ప్రసాదించి, ఆమె పరువు, శీలాన్ని కాపాడుతాడు.
ద్రౌపది శ్రీకృష్ణుడి వేలికి కట్టిన వస్త్రపు ముక్కను అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే రక్షా బంధానికి ప్రతీకగా పురాణాల్లో పేర్కొంటారు.
రాఖీ పండుగకు సంబంధించి మరో పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతుండగా దేవతల రాజైన ఇంద్రుడు ఓడిపోయి శక్తిహీనుడవుతాడు.
తన పరివారంతో కలిసి అమరావతిలో ఆశ్రయం పొందుతాడు. తన భర్త పరిస్థితిని చూసి ఇంద్రాణి ఆందోళన చెందుతుంది.
రాక్షస రాజు అమరావతిని ముట్టడిస్తున్నాడని తెలుసుకున్న ఆమె.. ఇంద్రుడిని తిరిగి యుద్ధానికి సిద్ధం కావాలని చెబుతుంది.
వివరాలు
ఆ రక్షతోనే విజయం సాధించిన ఇంద్రుడు..
శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించిన అనంతరం దేవతలు తాము పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడి చేతికి కడతారు.
ఆ రక్షను ధరించిన ఇంద్రుడు తిరిగి యుద్ధానికి వెళ్లి విజయం సాధిస్తాడు.
శచీదేవి ప్రారంభించిన ఈ రక్షా బంధన సంప్రదాయమే కాలక్రమంలో రాఖీ పండుగగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే రాఖీ పండుగ కేవలం అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమను చాటే పండుగ మాత్రమే కాదు.
పరస్పరం ఒకరికొకరు అండగా నిలవడం, ఆపదలో రక్షణగా ఉండటం, ప్రేమాభిమానాలను పంచుకోవడం వంటి భావాలకు కూడా ఇది ప్రతీకగా నిలుస్తుంది. ః
శ్రావణ పౌర్ణమి సందర్భంగా జరుపుకునే ఈ పండుగ భారతీయ సంస్కృతి, కుటుంబ బంధాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.