Sri Rama Navami: శ్రీరామనవమి రోజున రాముడికి వడపప్పు, పానకం ఎందుకు పెడతారు? తప్పక తెలుసుకోవాల్సిన నియమాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి సంవత్సరం చైత్ర మాస శుద్ధ నవమి రోజున శ్రీరామనవమిను ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు శ్రీరాముడు జన్మించిన పవిత్ర దినంగా భావిస్తారు. విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడు న్యాయం, ధర్మం, సత్యం, ప్రేమలకు ప్రతిరూపంగా ఆరాధించబడుతారు. పూజలు, వేడుకలు శ్రీరామనవమి రోజున భక్తులు ఉపవాసం ఉండి, రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రామాలు, పట్టణాల్లోని రామాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి . ఈ సందర్భంగా శ్రీరామకథను పారాయణం చేయడం, సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం సంప్రదాయం.
వివరాలు
వడపప్పు, పానకం ఎందుకు?
ఈ రోజున ప్రత్యేకంగా వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించడం వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది. శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు. రామనవమి కాలంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచే పదార్థాలు రాముడికి సమర్పించడం ఆనవాయితీగా మారింది. వడపప్పు పెసరపప్పును నానబెట్టి తయారు చేస్తారు. కొందరు అందులో బెల్లం, కొబ్బరి కలిపి నైవేద్యంగా పెడతారు. ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది, వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పానకం బెల్లం నీటిలో కలిపి, యాలకులు, మిరియాలు వంటి పదార్థాలు జోడించి తయారు చేస్తారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది, వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రెండు నైవేద్యాలను శ్రీరాముడికి సమర్పిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
వివరాలు
ఈ రోజున చేయకూడని పనులు
శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలు పాటించడం మంచిదిగా భావిస్తారు సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి; మాంసం, మద్యం, ఉల్లిపాయ వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. పెద్దలను దూషించడం, కోపం ప్రదర్శించడం నివారించాలి. గోర్లు, జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టుకోవడం, ఇతరులతో తగాదాలు పెట్టుకోవడం మంచిది కాదు. ఈ నియమాలను పాటిస్తూ భక్తితో పూజలు చేస్తే శ్రీరాముని కృప లభిస్తుందని విశ్వాసం.