Largest Iceberg A23a: 50 ఏళ్ల ప్రయాణం ముగిసింది.. A23a మంచుకొండ ఇక చరిత్రే
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండగా గుర్తింపు పొందిన A23a ఐస్బర్గ్ దశాబ్దాల పాటు అంటార్కిటికా సముద్ర జలాల్లో తేలియాడిన తర్వాత చివరకు పూర్తిగా కనుమరుగైంది. దాదాపు 50 ఏళ్ల పాటు సాగిన ఈ అద్భుత ప్రయాణం శాస్త్రవేత్తలకు అరుదైన అధ్యయన అవకాశాన్ని కల్పించింది. అమెరికా నేషనల్ ఐస్ సెంటర్ తాజా సమాచారం ప్రకారం, 2026 మార్చి నాటికి A23a పరిమాణం గణనీయంగా తగ్గిపోవడంతో ఇకపై దానిని ట్రాక్ చేయడం సాధ్యం కాదని ప్రకటించింది. ఈ మంచుకొండ కథ 1970ల మధ్యలో ప్రారంభమైంది. అప్పట్లో సోవియట్ యూనియన్ అంటార్కిటికాలోని ఫిల్చ్నర్ ఐస్ షెల్ఫ్ సమీపంలో డ్రుజ్నయా-1 అనే కాలానుగుణ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
వివరాలు
1987 తరువాత మళ్లీ ఎవరూ A23పై అడుగుపెట్టినట్లు నమోదు కాలేదు
ప్రతి వేసవిలో అక్కడ పరిశోధనలు సాగేవి.అయితే 1986 అక్టోబర్లో శాస్త్రవేత్తలు తిరిగి వెళ్లే సమయానికి ఆ కేంద్రం కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
తర్వాత జరిగిన పరిశోధనల్లో, భారీ మంచు పలక విరిగిపోవడంతో ఏర్పడిన A23 అనే మంచుకొండపై ఆ కేంద్రం కొట్టుకుపోయిందని తేలింది.
1987 జనవరిలో సోవియట్ బృందం హెలికాప్టర్ ద్వారా ఆ మంచుకొండపై దిగి,మంచులో కూరుకుపోయిన విలువైన పరికరాలను రెండు వారాల పాటు శ్రమించి వెలికితీసింది.
ఆ తర్వాత మళ్లీ ఎవరూ A23పై అడుగుపెట్టినట్లు నమోదు కాలేదు.
1991లో A23 అనేక ముక్కలుగా విడిపోగా,వాటిలో అతిపెద్ద భాగానికి A23a అని పేరు పెట్టారు.
దాదాపు 2,000 చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన ఈ మంచుకొండ ఇండోనేషియాలోని బాలి ద్వీపం పరిమాణంలో ఉండేది.
వివరాలు
2020లో A23a మళ్లీ కదలడం ప్రారంభించింది
అనేక సంవత్సరాల పాటు వెడ్డెల్ సముద్రంలో సముద్రపు మంచు, సముద్ర అడుగుభాగం కారణంగా అది కదలకుండా నిలిచిపోయింది.
2020లో A23a మళ్లీ కదలడం ప్రారంభించింది. కొన్ని సముద్ర మైళ్ల మేర తిరిగిన తర్వాత అది వెడ్డెల్ గైర్ ప్రవాహంలో చేరి, రెండేళ్లలో దాదాపు వెయ్యి నాటికల్ మైళ్లు ప్రయాణించింది.
అప్పటికి దాని విస్తీర్ణం సుమారు 1,500 చదరపు మైళ్లుగా ఉండటంతో ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండగా మరోసారి గుర్తింపు పొందింది.
2023 చివర్లో దక్షిణ మహాసముద్రంలోకి ప్రవేశించిన A23a ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది.
దీని కదలిక వాతావరణ మార్పుల ప్రభావం కంటే సహజ ప్రక్రియలో భాగమేనని పరిశోధకులు తెలిపారు.
వివరాలు
2024లో A23a నెలల తరబడి ఒకే చోట తిరిగింది
ఈ సమయంలో అనేక పరిశోధనా బృందాలు మంచుకొండ చుట్టుపక్కల సముద్ర జలాల నమూనాలు సేకరించి, కరుగుతున్న మంచు సముద్ర జీవవ్యవస్థపై చూపుతున్న ప్రభావాన్ని అధ్యయనం చేశాయి.
2024 మార్చిలో సముద్రంలోని ప్రత్యేక ప్రవాహంలో చిక్కుకున్న A23a నెలల తరబడి ఒకే చోట తిరుగుతూ ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.
సముద్ర అడుగున ఉన్న పర్వతం కారణంగా ఏర్పడే టేలర్ కాలమ్ అనే అరుదైన సహజ ఘటన వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు వారు గుర్తించారు.
ఆ ఏడాది చివర్లో అక్కడి నుంచి బయటపడిన తర్వాత వెచ్చని సముద్ర జలాల్లోకి ప్రవేశించిన A23a క్రమంగా కరుగుతూ చిన్న చిన్న ముక్కలుగా విడిపోవడం ప్రారంభమైంది.
వివరాలు
2025 జూన్ నాటికి A23a విస్తీర్ణం 1,200 చదరపు మైళ్ల కంటే తక్కువకు తగ్గిపోయింది
2025 ప్రారంభంలో మంచు కరుగుతుండటంతో దాదాపు 38 ఏళ్లుగా మంచులో చిక్కుకుపోయిన డ్రుజ్నయా-1 పరిశోధన కేంద్రానికి చెందిన తుప్పుపట్టిన డ్రమ్లు, నిల్వ ట్యాంకులు బయటపడ్డాయి.
అనంతరం ఈ మంచుకొండ దక్షిణ జార్జియా సమీపానికి చేరుకుని సముద్ర అడుగున ఉన్న రిడ్జ్ను ఢీకొని కొంతకాలం అక్కడే నిలిచింది.
తర్వాత మళ్లీ ప్రవాహంతో ముందుకు సాగింది. 2025 జూన్ నాటికి A23a విస్తీర్ణం 1,200 చదరపు మైళ్ల కంటే తక్కువకు తగ్గిపోయింది.
దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండగా ఉన్న హోదాను కూడా కోల్పోయింది.
అనంతరం వెచ్చని సముద్ర జలాల్లో మరింత వేగంగా కరుగుతూ చిన్న చిన్న భాగాలుగా విడిపోయింది.
వివరాలు
2026 మార్చిలో A23a పరిమాణం మరీ చిన్నదిగా మారింది
చివరకు 2026 మార్చిలో A23a పరిమాణం మరీ చిన్నదిగా మారడంతో దానిని ఇకపై గుర్తించి ట్రాక్ చేయడం సాధ్యం కాదని అమెరికా నేషనల్ ఐస్ సెంటర్ వెల్లడించింది.
కొన్ని చిన్న మంచు ముక్కలు ఇంకా సముద్రంలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ, దశాబ్దాల పాటు సాగిన ఈ భారీ మంచుకొండ ప్రయాణం ముగిసినట్టేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అంటార్కిటికా నుంచి దక్షిణ మహాసముద్రం వరకు సాగిన ఈ అరుదైన ప్రయాణం, ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండల జీవచక్రాన్ని అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలకు అమూల్యమైన సమాచారాన్ని అందించింది.