Apple: భారత్లో యాప్ స్టోర్కు మళ్లీ కార్డ్ చెల్లింపులు ప్రారంభించిన ఆపిల్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్లో యాప్ స్టోర్, ఐక్లౌడ్ సేవలకు సంబంధించిన కొనుగోళ్ల కోసం ఆపిల్ మళ్లీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఐదేళ్లుగా భారతీయ వినియోగదారులు యూపీఐ,నెట్ బ్యాంకింగ్ ద్వారానే చెల్లింపులు చేసే అవకాశం ఉండగా,ఇప్పుడు మళ్లీ కార్డ్ ద్వారా కూడా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అమలు చేసిన కార్డ్ టోకెనైజేషన్ నిబంధనల కారణంగా ఆపిల్ 2021లో కార్డ్ చెల్లింపులను నిలిపివేసింది. ప్రస్తుతం ఆ నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థలో మార్పులు చేసిన తర్వాత కార్డ్ పేమెంట్లను తిరిగి ప్రారంభించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం టోకెనైజ్ చేసిన కార్డ్ డేటాను కేవలం కార్డ్ నెట్వర్క్లే నిల్వ చేయాలి. అలాగే ఆ సమాచారం భారత్లోనే భద్రపరచాల్సి ఉంటుంది.
వివరాలు
ఆపిల్ బ్యాంకులతో చర్చలు
ప్రస్తుతం ఈ సదుపాయాన్ని కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారులతో పరీక్షిస్తున్నారు. రానున్న నెలల్లో దశలవారీగా దేశంలోని అన్ని ఆపిల్ వినియోగదారులకు ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోవైపు, భారత్లో ఆపిల్ పే సేవలను ప్రారంభించేందుకు ఆపిల్ బ్యాంకులతో చర్చలు కొనసాగిస్తోంది. అయితే కమిషన్ రేట్లు, నియంత్రణ సంబంధిత అంశాలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ప్రారంభం ఆలస్యమవుతోంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం టోకెనైజ్ చేసిన చెల్లింపు డేటాను భారత్లోనే నిల్వ చేయాల్సి ఉండగా, ఆపిల్కు ప్రస్తుతం దేశంలో డేటా సెంటర్ లేదు. అమెరికా, డెన్మార్క్,చైనాల్లో మాత్రమే కంపెనీ డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. ఈ డేటా నిబంధనలకు సంబంధించిన సమస్యల కారణంగా గత మూడేళ్లుగా భారత్లో ఆపిల్ పే ప్రారంభం వాయిదా పడుతోంది.