LOADING...
Iran: ఖమేనీ అంత్యక్రియల్లో ప్రతీకార జ్వాలలు.. ట్రంప్, నెతన్యాహును చంపాలంటూ నినాదాలు!
ఖమేనీ అంత్యక్రియల్లో ప్రతీకార జ్వాలలు.. ట్రంప్, నెతన్యాహును చంపాలంటూ నినాదాలు!

Iran: ఖమేనీ అంత్యక్రియల్లో ప్రతీకార జ్వాలలు.. ట్రంప్, నెతన్యాహును చంపాలంటూ నినాదాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనల సందర్భంగా రాజధాని టెహ్రాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో మరణించిన ఖమేనీకి అధికారికంగా నిర్వహిస్తున్న అంతిమయాత్రలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇరాన్ రాజకీయ,సైనిక ఉన్నత నాయకత్వం చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించింది. ఫిబ్రవరి 28న అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు మరణించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా నాలుగు నెలల పాటు వాయిదా పడిన అంత్యక్రియల శవయాత్రను ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు వారం రోజుల పాటు అధికారికంగా నిర్వహిస్తోంది.

వివరాలు 

మహ్మద్ రసూలీ తీవ్ర వ్యాఖ్యలు

అంత్యక్రియల ప్రార్థనలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెల్లవారుజామునే లక్షలాది మంది ప్రార్థనా స్థలానికి చేరుకుని ఇరాన్ జాతీయ జెండాలతో పాటు ప్రతీకారానికి చిహ్నంగా భావించే ఎరుపు జెండాలను ప్రదర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వారిని హతమార్చాలని కోరుతూ పోస్టర్లు, గోడలపై గ్రాఫిటీలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన కవి మహ్మద్ రసూలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఇకపై కఫనమే మా వస్త్రం.. ట్రంప్‌ను చంపడం మా బాధ్యత" అంటూ పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన ఘోలామ్రేజా సాబూని అనే వ్యక్తి కూడా తమ ఇమామ్‌ను హత్య చేసిన ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని వ్యాఖ్యానించాడు.

వివరాలు 

ఇజ్రాయెల్ నుంచి ప్రాణహాని హెచ్చరికలు ఉన్నప్పటికీ..

మరోవైపు అర్మేనియాలోని ఇరాన్ రాయబారి ఖలీల్ షిర్‌ఘోలామి ఎక్స్‌లో స్పందిస్తూ, "మీరు మనుషులను చంపగలరు కానీ ఆదర్శాలను అంతం చేయలేరు. అయాతొల్లా ఖమేనీని చంపడం అంటే పరిమళాల సీసాను పగలగొట్టినట్టే. ఆ సువాసన ఇప్పుడు మరింత విస్తరించింది" అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ నుంచి ప్రాణహాని హెచ్చరికలు ఉన్నప్పటికీ ఇరాన్ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరై తమ ఐక్యతను ప్రదర్శించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ ఖలీబాఫ్, కుద్స్ ఫోర్స్ అధిపతి ఇస్మాయిల్ ఖానీ, రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్ అహ్మద్ వాహిదీతో పాటు ఖమేనీ కుమారులు మసౌద్, మేసమ్, ముస్తఫా కూడా చాలా కాలం తర్వాత బహిరంగంగా కనిపించారు.

Advertisement

వివరాలు 

అంత్యక్రియల ప్రార్థనలకు నాయకత్వం వహించిన  97ఏళ్ల షియా మతగురువు

అయితే,దాడిలో గాయపడి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు భావిస్తున్న కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. గతంలో బహిరంగ కార్యక్రమాల ద్వారా నాయకుల కదలికలను గుర్తించి ఇజ్రాయెల్ దాడులు చేసిన ఘటనలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 97ఏళ్ల షియా మతగురువు అయాతొల్లా జాఫర్ శోభాని అంత్యక్రియల ప్రార్థనలకు నాయకత్వం వహించారు. ఖమేనీతో పాటు ఆయన కోడలుజహ్రా హద్దాద్ అడెల్,14నెలల మనవరాలు జహ్రా మొహమ్మది గొల్పాయిగాని శవపేటికలను కూడా ప్రార్థనా వేదికపై ఉంచారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఇరాన్, ఇరాక్‌లోని పలు నగరాల్లో ప్రజల సందర్శనార్థం తీసుకెళ్లిన అనంతరం,గురువారం ఆయన జన్మస్థలం మషాద్‌లోని ఇమామ్ రెజా బలిపీఠం వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement