Mega Earth: భూమి కంటే 23 రెట్లు భారీ రాతి గ్రహం.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న 'మెగా ఎర్త్'
ఈ వార్తాకథనం ఏంటి
ఖగోళ శాస్త్రవేత్తలు అసాధారణమైన సాంద్రత కలిగిన ఓ కొత్త ఎక్స్ప్లానెట్ను గుర్తించారు. ఈ గ్రహం కొన్ని రాతి గ్రహాలు ఎలా ఏర్పడి, ఎలా పరిణామం చెందుతాయనే విషయంపై శాస్త్రవేత్తలు ఇప్పటివరకు అనుకున్న విధానాలను పునరాలోచించేలా చేస్తోంది. GJ 523bగా గుర్తించిన ఈ గ్రహం వెడల్పు భూమి కంటే దాదాపు 2.55 రెట్లు ఎక్కువగా ఉండగా.. దాని ద్రవ్యరాశి మాత్రం భూమి కంటే సుమారు 23.5 రెట్లు ఎక్కువగా ఉంది. ఇంత పెద్ద గ్రహం హైడ్రోజన్, హీలియంతో కూడిన మందమైన వాతావరణాన్ని ఏర్పరచుకుని ఉండే అవకాశం ఉంది. అయితే పరిశీలనల్లో ఈ గ్రహం ఎక్కువగా రాతితోనే ఉన్నట్లు, చాలా తక్కువ మొత్తంలో వాయువులు ఉన్నట్లు తేలింది.
వివరాలు
శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న అంశం ఇదే..
GJ 523b విషయంలో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న అంశం ఇదే.
సాధారణంగా ఓ యువ గ్రహం ఒక నిర్దిష్ట ద్రవ్యరాశి పరిమితిని దాటిన తర్వాత పెద్ద మొత్తంలో వాయువులను ఆకర్షించి, మందమైన వాతావరణ పొరను ఏర్పరచుకుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తారు.
అయితే GJ 523b విషయంలో అలా జరగలేదు. "మేము అసలు ఇలా జరుగుతుందని ఊహించలేదు" అని ఈ అధ్యయనానికి ప్రధాన రచయిత మాక్స్ క్రాఫ్ట్ తెలిపారు.
GJ 523b పరిమాణం, అత్యంత అధిక సాంద్రత, తక్కువ వయసు కారణంగా ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఈ ఎక్స్ప్లానెట్ వ్యాసార్థం భూమి కంటే దాదాపు 2.55 రెట్లు ఉండగా.. ద్రవ్యరాశి 23.5 భూముల ద్రవ్యరాశికి సమానంగా ఉంది.
మాతృ నక్షత్రం చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి 17.75 రోజులు పడుతుంది.
వివరాలు
గ్రహ వ్యవస్థ వయసు సుమారు 17 కోట్ల సంవత్సరాలు మాత్రమే..
తన పరిమాణానికి పోలిస్తే ఈ గ్రహం అత్యంత అధిక సాంద్రతను కలిగి ఉంది.
దీని ద్వారా ఇందులో తేలికపాటి వాయువులతో కూడిన భారీ పొర కంటే.. రాయి, లోహం వంటి భారమైన పదార్థాలు పెద్ద మొత్తంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ గ్రహ వ్యవస్థ వయసు సుమారు 17 కోట్ల సంవత్సరాలు మాత్రమే ఉంటుందని అంచనా. అంటే ఖగోళ కాలమానంలో GJ 523b ఇంకా చాలా చిన్న వయసున్న గ్రహమే.
GJ 523bను తొలిసారిగా నాసాకు చెందిన ట్రాన్సిటింగ్ ఎక్స్ప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) ఓ అభ్యర్థి గ్రహంగా గుర్తించింది.
నక్షత్రం కాంతిలో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తుంది. ఇలాంటి మార్పుల ఆధారంగా గ్రహాలను గుర్తిస్తారు.
వివరాలు
శాస్త్రవేత్తలకు ఆసక్తికర ప్రశ్న..
మన సౌర కుటుంబంలో గురు గ్రహం, శని గ్రహాలు తమ కోర్లు భూమి ద్రవ్యరాశికి దాదాపు 20 రెట్లు చేరుకున్న తర్వాత భారీ మొత్తంలో వాయువులను వేగంగా ఆకర్షించుకున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
GJ 523b అధిక సాంద్రత కలిగి ఉండటం వల్ల ఇందులో చాలా తక్కువ మొత్తంలో వాయువులు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో ఓ ప్రాథమిక ప్రశ్న శాస్త్రవేత్తలను వెంటాడుతోంది. ఇంత భారీ ద్రవ్యరాశి ఉన్నప్పటికీ, పెద్ద మొత్తంలో వాయువులను ఆకర్షించే అవకాశం ఉన్నప్పటికీ.. GJ 523b ఇంత దట్టమైన రాతి గ్రహంగానే ఎందుకు మిగిలిపోయింది? అనేదే ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.