Cyber Fraud: సైబర్ నేరాలకు కేంద్రం చెక్.. 3,718 మొబైల్ యాప్లపై నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దేశంలో 3,718 మొబైల్ అప్లికేషన్లను నిషేధించినట్లు కేంద్ర హోంశాఖ లోక్సభకు వెల్లడించింది. నిషేధిత యాప్లలో మోసపూరిత రుణ యాప్లు కూడా ఉన్నాయని తెలిపింది. జూన్ 30, 2026 నాటికి దేశంలో మొత్తం 3,718 మొబైల్ యాప్లపై నిషేధం విధించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. అనుమానాస్పద, నేరపూరిత కార్యకలాపాలకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించిన 15.75 లక్షలకు పైగా సిమ్ కార్డులను, 5.77 లక్షల ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేసినట్లు తెలిపారు.
వివరాలు
సైబర్ నేరాలను అడ్డుకునేందుకు CFCFRMS ఏర్పాటు
సైబర్ నేరాలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన 'సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRMS)' ద్వారా వచ్చిన 32.80 లక్షలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించినట్లు కేంద్రం వెల్లడించింది.
ఈ చర్యలతో నేరగాళ్ల చేతికి వెళ్లకుండా రూ.11,158 కోట్లను కాపాడినట్లు పేర్కొంది.
వివరాలు
మ్యూల్ ఖాతాలపైనా నిఘా
సైబర్ నేరగాళ్లు చోరీ చేసిన నగదును తరలించేందుకు ఉపయోగించే మ్యూల్ బ్యాంకు ఖాతాలపై కూడా కేంద్రం చర్యలను వేగవంతం చేసింది.
ఈ ఏడాది జూన్ 30 నాటికి 32.08 లక్షల అనుమానిత మ్యూల్ ఖాతాలను గుర్తించినట్లు తెలిపింది.
వీటి ద్వారా జరగాల్సిన రూ.25,698 కోట్ల విలువైన అక్రమ లావాదేవీలను అడ్డుకున్నట్లు వెల్లడించింది.
పలు ప్రభుత్వ సంస్థలు, సాంకేతిక సంస్థల సహకారంతో ఈ చర్యలను చేపట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వివరించారు.
సైబర్ నేరగాళ్లు అక్రమంగా సంపాదించిన డబ్బును ఇతర ఖాతాలకు మళ్లించేందుకు ఉపయోగించే ఖాతాలపై నిఘా పెంచినట్లు తెలిపారు.
వివరాలు
ఫిర్యాదులకు 1930 హెల్ప్లైన్
ఆర్థిక మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, నకిలీ వెబ్సైట్లు, మోసపూరిత యాప్ల ద్వారా జరిగే దోపిడీలు, సోషల్ మీడియా నేరాలపై ఫిర్యాదు చేసేందుకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అందుబాటులో ఉంటుందని కేంద్రం తెలిపింది.
పౌరులు 1930 హెల్ప్లైన్ నంబర్ ద్వారా కూడా సైబర్ మోసాలను నివేదించవచ్చని పేర్కొంది.
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కూడా కేంద్రం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఎస్ఎంఎస్లు, టీవీ, రేడియో ప్రకటనలు, డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన సందేశాలను పంపిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.