ChatGPT: చాట్జీపీటీలో ఇక ప్రకటనలు.. భారత్లో ఈ యూజర్లకే యాడ్స్!
ఈ వార్తాకథనం ఏంటి
చాట్జీపీటీని ఉపయోగించే వారికి ఇకపై ప్రకటనలు కూడా కనిపించనున్నాయి. భారత్లో 'చాట్జీపీటీ యాడ్స్'ను ప్రవేశపెట్టనున్నట్లు ఓపెన్ఏఐ వెల్లడించింది. ప్రస్తుతం 'ఫ్రీ', 'గో' ప్లాన్లను ఉపయోగిస్తున్న లాగిన్ అయిన వయోజన యూజర్లకు మాత్రమే ఈ ప్రకటనలు చూపించనుంది. భారత్లో చాట్జీపీటీ 'గో' ప్లాన్ ధర నెలకు రూ.399గా ఉంది. సమాధానం కింద స్పాన్సర్డ్ యాడ్స్.. చాట్జీపీటీ సమాధానం పూర్తయిన తర్వాత దాని దిగువ భాగంలో స్పాన్సర్డ్ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తాయి. వీటిని సాధారణ కంటెంట్తో కలగలపకుండా ప్రత్యేకంగా 'యాడ్'గా గుర్తిస్తారు. చాట్జీపీటీ రూపొందించే సమాధానాలు, ప్రకటనల మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండేలా వ్యవస్థను రూపొందించినట్లు ఓపెన్ఏఐ తెలిపింది.
వివరాలు
ప్రీమియం ప్లాన్లకు మినహాయింపు
ప్లస్, ప్రో, బిజినెస్, ఎంటర్ప్రైజ్, ఎడ్యుకేషన్ ప్లాన్లను ఉపయోగించే వారికి ప్రకటనలు కనిపించవు.
అంటే చెల్లింపు ఆధారిత ఈ ప్లాన్లలో కొనసాగుతున్న యూజర్లు యాడ్స్ లేకుండానే చాట్జీపీటీ సేవలను ఉపయోగించుకోవచ్చు.
ప్రైవసీకి ఢోకా లేదు..
ప్రకటనల కారణంగా యూజర్ల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది.
యూజర్ల చాట్స్, చాట్ హిస్టరీ, మెమరీస్, వ్యక్తిగత వివరాలను ప్రకటనదారులు యాక్సెస్ చేయలేరని తెలిపింది. యూజర్ల డేటాను ప్రకటనదారులకు విక్రయించే ప్రసక్తే లేదని పేర్కొంది.
యాడ్స్ పనితీరుకు సంబంధించిన గణాంకాలను మాత్రమే ప్రకటనదారులతో పంచుకుంటామని ఓపెన్ఏఐ వెల్లడించింది.
ఇందులో ప్రకటనలు ఎన్ని సార్లు యూజర్లకు కనిపించాయి, వాటిపై ఎన్ని క్లిక్స్ వచ్చాయి వంటి వివరాలు మాత్రమే ఉంటాయి.
వివరాలు
మైనర్లకు, సున్నితమైన అంశాలపై యాడ్స్ ఉండవు
18 ఏళ్లలోపు వారిగా గుర్తించిన ఖాతాలకు ప్రకటనలు చూపించబోరు.
అంతేకాకుండా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, రాజకీయాలు వంటి సున్నితమైన లేదా నియంత్రిత అంశాలపై చాట్జీపీటీ ఇచ్చే సమాధానాల పక్కన కూడా ప్రకటనలను ప్రదర్శించరు.
50కి పైగా బ్రాండ్లతో భారత్లో ప్రారంభం
భారత్లో ఈ వారం నుంచే 50కి పైగా బ్రాండ్లు చాట్జీపీటీలో ప్రకటనలు ప్రారంభించనున్నట్లు ఓపెన్ఏఐ తెలిపింది.
వ్యాపార సంస్థలు నేరుగా ప్రకటనలు నిర్వహించుకునేలా సెప్టెంబర్ 4 నుంచి భారత్లో 'యాడ్స్ మేనేజర్'ను అందుబాటులోకి తీసుకురానుంది.
దీని ద్వారా రోజుకు కనీసం రూ.725 బడ్జెట్తో యాడ్స్ కోసం నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
100 కోట్ల వారపు యూజర్లను దాటిన చాట్జీపీటీ
చాట్జీపీటీ వినియోగం ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతోంది.
ఈ నెల ప్రారంభంలో వారానికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా యూజర్లు చాట్జీపీటీని ఉపయోగిస్తున్నట్లు ఓపెన్ఏఐ వెల్లడించింది.
భారత్లో 2026 ఫిబ్రవరి నాటికి వారానికి 10 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. వీరిలో విద్యార్థులు, డెవలపర్లు, విద్యావేత్తలు, సంస్థలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
వివరాలు
అమెరికా నుంచి ఇతర దేశాలకు విస్తరణ
చాట్జీపీటీలో ప్రకటనల ప్రయోగాన్ని ఓపెన్ఏఐ తొలిసారిగా 2026 జనవరిలో ప్రకటించింది.
అనంతరం ఫిబ్రవరిలో అమెరికాలో యాడ్స్ ప్రయోగాన్ని ప్రారంభించింది. కేవలం ఆరు వారాల్లోనే ఈ ప్రకటనల ద్వారా 10 కోట్ల డాలర్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం.
అమెరికా తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, మెక్సికో, బ్రెజిల్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఈ సేవను విస్తరించింది.
తాజాగా గత వారం 31 యూరోపియన్ దేశాల్లోనూ చాట్జీపీటీ యాడ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.