Ebola: ఎబోలా విజృంభణతో వణుకుతున్న కాంగో.. 2 వేలకుపైగా మరణాలు
ఈ వార్తాకథనం ఏంటి
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్ కాంగో)లో ప్రస్తుతం కొనసాగుతున్న ఎబోలా వ్యాప్తి చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైనదిగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రస్తుత వేగం ఇలాగే కొనసాగితే 2014-16 మధ్య పశ్చిమ ఆఫ్రికాలో సంభవించిన ఎబోలా వ్యాప్తి రికార్డును తాజా మహమ్మారి దాటే అవకాశం ఉందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. అప్పటి వ్యాప్తిలో కనీసం 11 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2026లో కాంగోలో వెలుగుచూసిన ఎబోలా వ్యాప్తిని మే 15న అధికారికంగా ప్రకటించారు. అయితే అప్పటికే వైరస్ వ్యాప్తి ప్రారంభమైందని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.
వివరాలు
ఎబోలా అదుపులోకి రావాలంటే మూడు నెలలు.. WHO కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం 4,300కుపైగా కేసులు నమోదుకాగా.. 2 వేల మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాప్తిని మూడు నెలల్లో నియంత్రణలోకి తీసుకురావాలని WHO లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే వైరస్ వ్యాప్తిని అదుపులోకి తీసుకురావడం అంటే మహమ్మారి పూర్తిగా ముగిసినట్లు కాదని స్పష్టం చేసింది.
బునియా నగరంలో జరిగిన మీడియా సమావేశంలో WHO ఆఫ్రికా డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ జనాబీ పరిస్థితి తీవ్రతను వివరించారు.
''మనం వైరస్ను వెంబడిస్తున్నాం.. కానీ వైరస్ మనకంటే ముందుంది'' అని ఆయన పేర్కొన్నారు.
పరిశోధనల ప్రకారం ఈ వైరస్ ఫిబ్రవరిలోనే వ్యాప్తి చెందడం ప్రారంభమై ఉండొచ్చని తెలిపారు.
తొలినాళ్లలో దీనిని మలేరియా లేదా టైఫాయిడ్గా పొరబడటంతో గుర్తించడంలో ఆలస్యం జరిగిందని చెప్పారు.
వివరాలు
బుండిబుగ్యో ఎబోలా కలకలం.. బాధితులను చేరుకోలేకపోతున్న వైద్య సిబ్బంది
ప్రస్తుత వ్యాప్తికి అరుదైన బుండిబుగ్యో ఎబోలా వైరస్ కారణమని అధికారులు తెలిపారు.
ఈ వైరస్ కారణంగా గతంలో కేవలం 2007, 2012 సంవత్సరాల్లో మాత్రమే రెండు వ్యాప్తులు నమోదయ్యాయి.
ఈ వైరస్ రకానికి ప్రస్తుతం ఆమోదం పొందిన వ్యాక్సిన్ లేదా ప్రత్యేకంగా గుర్తింపు పొందిన చికిత్సా మందులు అందుబాటులో లేవు.
తూర్పు కాంగోలో కొనసాగుతున్న ప్రాంతీయ అస్థిరత కూడా ఎబోలా నియంత్రణకు పెద్ద సవాలుగా మారింది.
ఘర్షణలు, మారుమూల ప్రాంతాలు, వైద్య సదుపాయాల కొరత కారణంగా ఆరోగ్య సిబ్బంది బాధితుల్లో కేవలం 30 శాతం మందిని మాత్రమే చేరుకోగలుగుతున్నారని జనాబీ తెలిపారు.
దీంతో వైరస్ వ్యాప్తిని గుర్తించడం, బాధితులను వేరుచేయడం, వారి సన్నిహితులను గుర్తించడం కష్టంగా మారింది.
వివరాలు
బుండిబుగ్యో ఎబోలాకు వ్యాక్సిన్ కోసం వేగంగా ప్రయత్నాలు
ఎబోలా అరుదైనప్పటికీ అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి.
వైరస్ సోకిన తర్వాత సాధారణంగా రెండు నుంచి 21రోజుల్లో లక్షణాలు కనిపించవచ్చు.
తొలుత జ్వరం,తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఇవి మలేరియా లేదా ఫ్లూ లక్షణాలను పోలి ఉండొచ్చు.
వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ వాంతులు,విరేచనాలు వంటి సమస్యలు తలెత్తి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
వైరస్ సోకిన వ్యక్తి రక్తం, వాంతులు వంటి శరీర ద్రవాలతో ప్రత్యక్షంగా సంపర్కం ఏర్పడితే మరొకరికి వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో బుండిబుగ్యో వైరస్ కోసం వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి.
బ్రిటన్కు చెందిన ఔషధ నియంత్రణ సంస్థ MHRA..ఈ వైరస్కు వ్యాక్సిన్ను మనుషులపై పరీక్షించేందుకు తొలి క్లినికల్ ట్రయల్స్కు అనుమతి ఇచ్చింది.
వివరాలు
ఎబోలా వ్యాక్సిన్ కోసం ఆక్స్ఫర్డ్ బృందం ప్రయత్నాలు
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తోంది.
కొవిడ్ సమయంలో ఉపయోగించిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లోని సాంకేతికత ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.
బుండిబుగ్యో వైరస్ కోసం మరో మూడు బృందాలు కూడా వేర్వేరు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి.
అయితే అవి ఇంకా మనుషులపై క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకోలేదు.
మరోవైపు, ఇప్పటికే అందుబాటులో ఉన్న రెండు యాంటీవైరల్ చికిత్సలు ఎబోలా బాధితుల ప్రాణాలను కాపాడటంలో ఎంతవరకు ఉపయోగపడతాయో తెలుసుకునేందుకు WHO కాంగోలో ప్రత్యేక క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తోంది.