Loading...
EU: జర్మన్‌ వెబ్‌సైట్‌ను స్వాధీనం చేసుకున్న ఓపెన్‌ఏఐ ఏజెంట్లు.. ఈయూ దర్యాప్తు
జర్మన్‌ వెబ్‌సైట్‌ను స్వాధీనం చేసుకున్న ఓపెన్‌ఏఐ ఏజెంట్లు.. ఈయూ దర్యాప్తు

EU: జర్మన్‌ వెబ్‌సైట్‌ను స్వాధీనం చేసుకున్న ఓపెన్‌ఏఐ ఏజెంట్లు.. ఈయూ దర్యాప్తు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఓపెన్‌ఏఐ రూపొందించిన స్వయంచాలక ఏఐ ఏజెంట్లకు సంబంధించిన ఓ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. గత వారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో.. ఆ ఏఐ ఏజెంట్లు తమకు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా జర్మనీకి చెందిన ఓ వెబ్‌సైట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రోగ్రామర్ల కోసం వికీపీడియా తరహాలో పనిచేసే సహకార వేదిక డీఎస్‌ఈవికీపై ఈ దాడి జరిగింది. రోగ్‌ బాట్లుగా మారిన ఈ ఏజెంట్లు అక్కడ సుమారు 18 వేల సందేశాలను వదిలినట్లు సమాచారం.

వివరాలు 

ఓపెన్‌ఏఐతో సన్నిహితంగా సంప్రదింపులు

ఈ ఘటనపై తమకు సమాచారం అందిందని ఈయూ డిజిటల్‌ ప్రతినిధి థామస్‌ రెగ్నియర్‌ తెలిపారు.

ఘటనకు సంబంధించిన నివేదిక కూడా అందినట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, అదే సమయంలో ఓపెన్‌ఏఐతో సన్నిహితంగా సంప్రదింపులు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

ఇటీవల ఏఐ వ్యవస్థలు అదుపు తప్పిన ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఇది తీవ్రమైన విషయమని ఆయన పేర్కొన్నారు.

పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు.

వివరాలు 

ఏఐ వ్యవస్థల ప్రమాదాలను అంచనా వేయాలి

ఈయూ ఏఐ నిబంధనల ప్రకారం.. ఏఐ వ్యవస్థల వల్ల ఎదురయ్యే ప్రమాదాలను ఆయా సంస్థలు ముందుగానే అంచనా వేసి, వాటిని తగ్గించే చర్యలు తీసుకోవాలి.

ఈ నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలపై జరిమానాలు విధించే అధికారం నియంత్రణ సంస్థలకు ఆగస్టు నుంచి అందుబాటులోకి వచ్చింది.

తాజా ఘటనకు కొన్ని నెలల ముందే ఓపెన్‌ఏఐకి చెందిన రెండు ఏఐ మోడళ్లు జులైలో తమ కోసం ఏర్పాటు చేసిన పరిమిత పరీక్షా వాతావరణం నుంచి బయటపడి, ఏఐ డెవలపర్లు కోడ్‌ను నిల్వ చేసి పంచుకునే హగింగ్‌ ఫేస్‌ వేదికపై దాడి చేసినట్లు సంస్థ వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఘటనపై యూరోపియన్‌ కమిషన్‌కు ఓపెన్‌ఏఐ నివేదిక

జర్మన్‌ వెబ్‌సైట్‌ను ఏఐ ఏజెంట్లు తమ ఆధీనంలోకి తీసుకున్న ఘటనపై ఓపెన్‌ఏఐ యూరోపియన్‌ కమిషన్‌కు నివేదిక సమర్పించింది.

ఘటనపై నివేదికలు ఇచ్చేటప్పుడు కేవలం నిబంధనలు పాటించామని చెప్పడం కాకుండా.. సంస్థలు తీసుకోబోయే చర్యల గురించి కచ్చితమైన, స్పష్టమైన వివరాలు ఇవ్వాలని కమిషన్‌ సూచించింది.

బాహ్య వ్యవస్థలతో ఏఐ ఏజెంట్లు స్వయంగా వ్యవహరించగలగడం, దాడికి గురైన వేదికను ఇతర ఏఐ ఏజెంట్లతో సమాచార మార్పిడికి ఉపయోగించుకోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

ADVERTISEMENT