Google: ఏఐ ఖర్చుల భారం.. తొలిసారి మైనస్లో గూగుల్ ఫ్రీ క్యాష్ ఫ్లో
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తాజా త్రైమాసికంలో ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నప్పటికీ, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక వసతులపై భారీగా ఖర్చు చేయడంతో సంస్థ నగదు ప్రవాహంపై ఒత్తిడి పెరిగింది. కార్యకలాపాలు,పెట్టుబడుల ఖర్చులు చెల్లించిన తర్వాత మిగిలే ఫ్రీ క్యాష్ ఫ్లో కనీసం గత పదేళ్లలో తొలిసారిగా 5.9బిలియన్ డాలర్ల ప్రతికూల స్థాయికి చేరినట్లు కంపెనీ ఆర్థిక వివరాలు వెల్లడించాయి. ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం ప్రపంచ టెక్ కంపెనీల మధ్య పోటీ మరింత తీవ్రం కావడంతో ఆల్ఫాబెట్ ఈ ఏడాది పెట్టుబడులను మరింత పెంచుతోంది. గతంలో ప్రకటించిన 190 బిలియన్ డాలర్ల అంచనాను పెంచుతూ, 2026లో ఏఐపై మొత్తం పెట్టుబడులు 195 నుంచి 205 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని కంపెనీ తెలిపింది.
వివరాలు
ఆఫ్టర్-ఆవర్స్ ట్రేడింగ్లో 4 శాతం పడిపోయిన కంపెనీ షేర్లు
అయితే మరోవైపు కంపెనీ వ్యాపార వృద్ధి కొనసాగుతోంది.
ఆల్ఫాబెట్ త్రైమాసిక ఆదాయం 119.8 బిలియన్ డాలర్లకు చేరి,గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 23 శాతం పెరిగింది.
అయినప్పటికీ, ఫలితాల ప్రకటన అనంతరం ఆఫ్టర్-ఆవర్స్ ట్రేడింగ్లో కంపెనీ షేర్లు సుమారు 4 శాతం వరకు పడిపోయాయి.
గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అనాట్ అష్కెనాజీ మాట్లాడుతూ, ఫ్రీ క్యాష్ ఫ్లో ప్రతికూలంగా మారడానికి ప్రధాన కారణం మూలధన వ్యయాలు పెరగడమేనని చెప్పారు.
అందులో దాదాపు మొత్తం ఖర్చు ఏఐ మౌలిక వసతుల నిర్మాణానికేనని వివరించారు.
రెండో త్రైమాసికంలో కంపెనీ 45బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా, అందులో 60 శాతం సర్వర్ల కోసం, మిగిలిన 40 శాతం డేటా సెంటర్ల అభివృద్ధికి వెచ్చించినట్లు తెలిపారు.
వివరాలు
పెట్టుబడుల విషయంలో కంపెనీ క్రమశిక్షణతో వ్యవహరిస్తోంది: అష్కెనాజీ
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మూలధన వ్యయం 36 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఏఐ సేవలకు డిమాండ్ ఇప్పటికీ పెట్టుబడుల కంటే వేగంగా పెరుగుతోందని అష్కెనాజీ పేర్కొన్నారు.
ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలు కనిపిస్తున్నంత వరకు సంస్థ ఏఐపై ఖర్చు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఏఐ రంగంలో ఇప్పుడే ప్రారంభ దశ కొనసాగుతోందని అన్నారు.
వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాలను అందించే సామర్థ్యం ఇంకా విస్తారంగా ఉందని, ప్రస్తుతం చేస్తున్న పెట్టుబడులు భవిష్యత్తులో మంచి ఆర్థిక ఫలితాలను అందిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే పెట్టుబడుల విషయంలో కంపెనీ క్రమశిక్షణతో వ్యవహరిస్తోందని చెప్పారు.
వివరాలు
రెండో త్రైమాసికంలో టెస్లా 1.1 బిలియన్ డాలర్ల నెగెటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో నమోదు
ఇదిలా ఉండగా, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ కిల్లిక్ అండ్ కో భాగస్వామి రాచెల్ వింటర్ మాట్లాడుతూ, గూగుల్ ఏఐపై చేస్తున్న భారీ పెట్టుబడులు పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేశాయని అన్నారు.
కంపెనీ ప్రకటించిన 195-205 బిలియన్ డాలర్ల వ్యయ అంచనాలే షేర్ల పతనానికి ఒక కారణంగా కనిపిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా కూడా పెరిగిన పెట్టుబడి వ్యయాల కారణంగా రెండో త్రైమాసికంలో 1.1 బిలియన్ డాలర్ల నెగెటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో నమోదు చేసింది.
వివరాలు
ఆఫ్టర్-ఆవర్స్ ట్రేడింగ్లో 4 శాతం పడిపోయిన టెస్లా షేర్లు
గత రెండేళ్లలో తొలిసారిగా కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లో మైనస్లోకి వెళ్లింది.
టెస్లా సీఎఫ్వో వైభవ్ తనేజా మాట్లాడుతూ, 2026లో కంపెనీ పెట్టుబడులు 25 బిలియన్ డాలర్ల వరకు చేరవచ్చని తెలిపారు.
ఇది 2025తో పోలిస్తే రెండింతలకు పైగా ఎక్కువ అని చెప్పారు.
ప్రస్తుతం టెస్లా భారీ పెట్టుబడుల దశలో ఉందని, రాబోయే మూడేళ్లలో ఖర్చులు మరింత పెరిగే అవకాశముందని వెల్లడించారు.
టెస్లా షేర్లు కూడా ఆఫ్టర్-ఆవర్స్ ట్రేడింగ్లో సుమారు 4 శాతం పడిపోయాయి.