LOADING...
cyber crimes in India: భారతదేశంలో సైబర్ నేరాలను మోడీ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తోంది?
భారతదేశంలో సైబర్ నేరాలను మోడీ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తోంది?

cyber crimes in India: భారతదేశంలో సైబర్ నేరాలను మోడీ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తోంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రభుత్వం ఆన్‌లైన్ ముప్పులు, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి బలమైన చట్టపరమైన వ్యవస్థతో సిద్ధంగా ఉందని స్పష్టంచేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖా సహాయమంత్రి జితిన్‌ ప్రసాదా రాజ్యసభలో ఈ విషయాన్ని తెలిపారు. భారత్‌ సైబర్‌ చట్టపరమైన వ్యవస్థ, మారుతున్న ఆన్‌లైన్‌ ముప్పులు, సైబర్‌ నేరాలను సమర్థంగా ఎదుర్కొనే స్థితిలో ఉందని ఆయన పేర్కొన్నారు.

AI బెదిరింపులు 

ఏఐ డీప్‌ఫేక్స్‌ - పెద్ద ముప్పు 

ఏఐ ఆధారిత డీప్‌ఫేక్స్‌ రూపంలో తయారయ్యే కృత్రిమ ఆడియో, వీడియో, టెక్స్ట్ కంటెంట్‌ వల్ల తీవ్ర ముప్పు ఉందని మంత్రి జితిన్‌ ప్రసాదా హెచ్చరించారు. ఇలాంటి కంటెంట్‌ వ్యక్తిగత గౌరవం, ప్రతిష్ట, వ్యక్తిగత గోప్యత హక్కుపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యత గురించి కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సైబర్‌ సెక్యూరిటీ చర్యలు 

చట్టపరమైన, వ్యవస్థాపరమైన ఏర్పాట్లు 

డీప్‌ఫేక్స్‌ ముప్పును అదుపులో ఉంచి, సురక్షిత సైబర్‌ వాతావరణం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర చట్టపరమైన, సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఏఐ ద్వారా కలిగే హానికర ప్రభావాలను ఎదుర్కొనే అనేక చట్టాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా, 2000లో అమల్లోకి వచ్చిన 'ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌' (ఐటీ చట్టం) వ్యక్తిగత గుర్తింపు దొంగతనం, ఇతరులుగా నటించడం, గోప్యత ఉల్లంఘన, అసభ్యకర కంటెంట్‌ పంపిణీ వంటి అంశాలను నేరంగా పరిగణిస్తుంది. అంతేకాక, ఈ చట్టం కింద అధికారులు వెబ్‌సైట్ల బ్లాక్‌ ఆర్డర్లు (సెక్షన్‌ 69A), కంటెంట్‌ తొలగింపు నోటీసులు (సెక్షన్‌ 79) జారీ చేసే అధికారం పొందారు.

డేటా రక్షణ 

డీప్‌ఫేక్స్‌పై వర్తించే మరిన్ని చట్టాలు 

2023లో అమల్లోకి వచ్చిన 'డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌' (డీపీపీడీ చట్టం) వ్యక్తిగత డేటాను చట్టబద్ధంగా, యూజర్‌ అనుమతితో మాత్రమే ఉపయోగించాలని డేటా నిర్వహణ సంస్థలకు ఆదేశిస్తుంది. అనుమతి లేకుండా వ్యక్తిగత డేటాతో డీప్‌ఫేక్స్‌ తయారు చేస్తే ఈ చట్టం కింద శిక్షించవచ్చు. అలాగే, 2023లో అమల్లోకి వచ్చిన 'భారతీయ న్యాయ సంహిత' (బీఎన్‌ఎస్‌)లోని 353, 111 సెక్షన్లు తప్పుడు సమాచార వ్యాప్తి, సైబర్‌ నేర గ్యాంగులపై చర్యలకు వర్తిస్తాయి.