New Supercontinent: మరో 20 కోట్ల ఏళ్లలో మహాఖండం.. మానవాళికి పెను ముప్పు!
ఈ వార్తాకథనం ఏంటి
భూమిపై ఉన్న ఖండాలన్నీ ఒకరోజు మళ్లీ ఒక్కటిగా కలిసి కొత్త మహాఖండంగా మారతాయని శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా చెబుతున్నారు. దాదాపు 20 కోట్ల ఏళ్ల క్రితం పాంజియా అనే మహాఖండం విడిపోవడం ప్రారంభమైంది. మరో 20 కోట్ల ఏళ్లలో ఖండాలు మళ్లీ కలిసే అవకాశం ఉంది. అయితే అది ఏ రూపంలో ఏర్పడుతుందనే దానిపై నాలుగు ప్రధాన అంచనాలు ఉన్నాయి. వీటిలో ఒకటి మానవులతో పాటు అన్ని క్షీరదాలకు తీవ్ర ముప్పుగా మారొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. 2018లో జియోలాజికల్ మ్యాగజైన్'లో ప్రచురితమైన పరిశోధనా కథనం ఈ నాలుగు అవకాశాలను వివరించింది.
వివరాలు
నోవోపాంజియా:
ఈ పరిస్థితిలో పసిఫిక్ మహాసముద్రం క్రమంగా మూసుకుపోతుంది. అదే సమయంలో అట్లాంటిక్ మహాసముద్రం మరింత విస్తరిస్తుంది.
అమెరికా ఖండాలు తూర్పు ఆసియా, అంటార్కిటికాతో ఢీకొని ఒకే భారీ భూభాగంగా మారతాయి.
ఈ మహాఖండం ప్రధానంగా ఉత్తర అర్ధగోళంలో విస్తరించి ఉంటుంది.
భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు వేడిగా, పొడిగా మారే అవకాశం ఉంది.
సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినా.. లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఎడారిలా మారొచ్చు. అయితే ఖండం చల్లని అక్షాంశాల వైపు కూడా విస్తరించడం వల్ల సముద్ర ప్రవాహాలు, ధ్రువ ప్రాంతాల్లో మంచు ఏర్పడే ప్రక్రియ కొంతవరకు కొనసాగుతాయి.
వివరాలు
ఆరికా:
మరో అంచనా ప్రకారం పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలు రెండూ మూసుకుపోయి 'ఆరికా' అనే కొత్త మహాఖండం ఏర్పడొచ్చు.
పసిఫిక్ సముద్రం సుమారు 20 కోట్ల ఏళ్ల నాటిది కాగా, అట్లాంటిక్ వయసు సుమారు 18 కోట్ల ఏళ్లు.
ఇవి 14 కోట్ల ఏళ్ల వయసున్న హిందూ మహాసముద్రం కంటే పాతవి కావడంతో ముందుగా మూసుకుపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఖండాల మధ్య ప్రాంతాలు చీలిపోయి, భూమిపై ఉన్న భూభాగాలన్నీ భూమధ్యరేఖ చుట్టూ ఒక వలయంలా ఏర్పడొచ్చు.
ఈ ప్రాంతం భూమధ్యరేఖకు సమీపంలో ఉండటంతో ప్రస్తుత భూమి కంటే కొంత ఎక్కువ వేడిగా, పొడిగా ఉండే అవకాశం ఉందని పోర్చుగల్లోని లిస్బన్ విశ్వవిద్యాలయానికి చెందిన టెక్టానిక్స్ నిపుణుడు జోవో సి. డువార్టే తెలిపారు.
వివరాలు
అమాసియా:
ఈ పరిస్థితిలో ఆర్కిటిక్ మహాసముద్రం మూసుకుపోతుంది.
అంటార్కిటికా మినహా మిగిలిన ఖండాలన్నీ ఉత్తర ధ్రువం వైపు కదులుతాయి. దీంతో దాదాపు మొత్తం భూభాగం ఉత్తర అర్ధగోళంలోనే కేంద్రీకృతమవుతుంది.
దక్షిణ అర్ధగోళంలో అంటార్కిటికాను మినహాయిస్తే భారీ సముద్రం మాత్రమే మిగులుతుంది.
భూమధ్యరేఖ నుంచి ధ్రువాలకు వేడిని తీసుకెళ్లే సముద్ర ప్రవాహ వ్యవస్థకు ఆటంకం ఏర్పడుతుంది.
ఫలితంగా ధ్రువ ప్రాంతాలు మరింత చల్లబడతాయి. అక్కడ ఏడాది పొడవునా మంచు కప్పుకుని ఉండే పరిస్థితి ఏర్పడొచ్చు.
వివరాలు
పాంజియా అల్టిమా/ప్రాక్సిమా:
నాలుగో అంచనా ప్రకారం అట్లాంటిక్ మహాసముద్రం పూర్తిగా మూసుకుపోతుంది. కొత్త సబ్డక్షన్ జోన్లు ఏర్పడటంతో సముద్రపు భూఫలకాలు కిందికి జారిపోతాయి.
హిందూ మహాసముద్రం కూడా మూసుకుపోయి అంతర్గత సముద్రంగా మారొచ్చు. అమెరికా ఖండాలు ఆసియాతో ఢీకొంటాయి.
చివరికి అన్ని ఖండాలు భూమధ్యరేఖ చుట్టూ ఒకటిగా కలిసి 'పాంజియా అల్టిమా' అనే భారీ మహాఖండాన్ని ఏర్పాటు చేయవచ్చు.
ఇది భూమధ్యరేఖ చుట్టూ పెద్ద వలయంలా కనిపించే భూభాగంగా ఉండొచ్చు.
వివరాలు
మానవాళిని అంతం చేసేది ఏది?:
ఈ నాలుగు అంచనాల్లో ఆరికా, అమాసియా ఏర్పడినా భూమిపై, సముద్రాల్లోని కొన్ని జీవజాతులకు తీవ్ర ముప్పు ఏర్పడొచ్చు.
అయితే పాంజియా అల్టిమా ఏర్పడితే మాత్రం మానవాళి మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఈ మహాఖండంలోని లోతట్టు ప్రాంతాలు సముద్రానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. దీంతో భూభాగంలో సుమారు 90 శాతం ప్రాంతం వేడి, పొడి ఎడారిగా మారొచ్చు.
ఇప్పటికే సూర్యుడు క్రమంగా మరింత ప్రకాశవంతంగా మారుతున్నాడు.
మరో 20కోట్ల ఏళ్ల తర్వాత సూర్యుడి ప్రభావం భూమిపై మరింత ఎక్కువగా ఉండొచ్చు.
ముఖ్యంగా పాంజియా అల్టిమాలోని అంతర్గత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
వివరాలు
భరించలేని వేడి.. క్షీరదాలకు పెను ప్రమాదం
టెక్టానిక్ కదలికల కారణంగా అనేక అగ్నిపర్వత విస్ఫోటనాలు చోటుచేసుకుంటే వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయులు కూడా భారీగా పెరగొచ్చు.
ఆ సమయంలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 70 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని అంచనా.
భూమిపై క్షీరదాలు నివసించేందుకు అనుకూలంగా ఉండే భూభాగం కేవలం 8 నుంచి 16 శాతానికి పడిపోవచ్చు.
సముద్రం నుంచి వచ్చే చల్లని గాలులు అందని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి నెలకొంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో మానవ శరీరం తనలోని వేడిని బయటకు పంపించుకోలేకపోవచ్చు.
దీంతో క్షీరదాల జీవనానికి అవసరమైన ఉష్ణ పరిమితిని భూమి దాటిపోయి, భారీ స్థాయిలో జీవజాతుల అంతరించిపోవడానికి దారితీయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వివరాలు
20 కోట్ల ఏళ్లలో భూమిపై పూర్తిగా కొత్త జీవచక్రం మొదలయ్యే అవకాశం
అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ మార్పులు చోటుచేసుకునే సమయానికి ఇప్పటి మానవులు ఎవరూ ఉండరు.
మరో 20 కోట్ల ఏళ్లలో భూమిపై పూర్తిగా కొత్త జీవచక్రం మొదలయ్యే అవకాశం ఉంది.
మారిన వాతావరణానికి తట్టుకుని బతికే సామర్థ్యం ఉన్న కొత్త జీవజాతులు అప్పటికి పరిణామం చెందవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.