India's CERN Journey: గాడ్ పార్టికల్ నుంచి డార్క్ మ్యాటర్ వరకు.. విశ్వ రహస్యాల్లో భారత్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అతిపెద్ద శాస్త్రీయ యంత్రంగా పేరుగాంచిన లార్జ్ హాడ్రాన్ కొలైడర్ (LHC) మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 5 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ మహా యంత్రం స్విట్జర్లాండ్-ఫ్రాన్స్ సరిహద్దులో భూమికి లోతుగా తవ్విన 27 కిలోమీటర్ల వృత్తాకార సొరంగంలో పనిచేస్తోంది. విశ్వం ఎలా ఆవిర్భవించింది? బిగ్ బ్యాంగ్ తర్వాత ఏమి జరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే లక్ష్యంతో వందకు పైగా దేశాలు కలిసి ఈ ప్రాజెక్టును రూపొందించాయి. ఈ వారం ఎల్హెచ్సీ తన ప్రస్తుత శాస్త్రీయ ప్రయోగాలను ముగించి తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే ఈ యంత్రం ద్వారా హిగ్స్ బోసాన్ (గాడ్ పార్టికల్) కనుగొనడం వంటి చారిత్రాత్మక విజయాన్ని ప్రపంచం చూసింది.
వివరాలు
సూక్ష్మ స్థాయి బ్లాక్ హోల్స్పై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు
అంతేకాదు, వరల్డ్ వైడ్ వెబ్ (WWW) రూపకల్పనకు దారితీసిన సాంకేతిక అభివృద్ధులు కూడా CERN నుంచే వెలువడ్డాయి. అత్యంత శక్తితో కణాలను ఒకదానితో ఒకటి ఢీకొట్టే ప్రయోగాల ద్వారా సూక్ష్మ స్థాయి బ్లాక్ హోల్స్పై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. ఇప్పుడు దాదాపు 1.5 బిలియన్ డాలర్ల వ్యయంతో ఎల్హెచ్సీని హై ల్యూమినాసిటీ లార్జ్ హాడ్రాన్ కొలైడర్ (HL-LHC)గా అప్గ్రేడ్ చేస్తున్నారు. నిర్వహణ, ఆధునీకరణ పనులు పూర్తయ్యాక 2030లో మళ్లీ కణాల ఢీకొనే ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి. భారత అణుశక్తి శాఖ ప్రకారం, ఈ అప్గ్రేడ్ ద్వారా మరింత ఖచ్చితమైన ప్రయోగాలు నిర్వహిస్తూ ప్రస్తుతం అమల్లో ఉన్న స్టాండర్డ్ మోడల్కు అతీతమైన భౌతిక శాస్త్ర సూత్రాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యం.
వివరాలు
కొత్త భౌతిక సూత్రాలపై కీలక ఆధారాలు
స్విట్జర్లాండ్లోని యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (CERN)లో ఉన్న ఎల్హెచ్సీ ఇప్పటికే విశ్వంపై మానవాళి అవగాహనను పూర్తిగా మార్చింది. ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టి డార్క్ మ్యాటర్పై నిలిచింది. విశ్వంలోని పదార్థంలో అత్యధిక భాగం డార్క్ మ్యాటర్దేనని భావిస్తున్నప్పటికీ, దానిని ఇప్పటివరకు నేరుగా గుర్తించలేకపోయారు. కొత్త అప్గ్రేడ్ తర్వాత అత్యంత వేగంతో కణాలను ఒకదానితో ఒకటి ఢీకొట్టే ప్రయోగాలు మరింత ఎక్కువగా జరుగుతాయి. వీటి ద్వారా డార్క్ మ్యాటర్తో పాటు ఇప్పటివరకు గుర్తించని కొత్త కణాలు, కొత్త భౌతిక సూత్రాలపై కీలక ఆధారాలు లభిస్తాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
వివరాలు
భారత్ ప్రతి ఏడాది రూ.100కోట్లకు పైగా ఆర్థిక సహకారం
ఈ మహత్తర శాస్త్రీయ ప్రయాణంలో భారత్ పాత్ర ఎంతో విశిష్టమైనది. ఆరు దశాబ్దాలకుపైగా భారత్కు CERNతో అనుబంధం కొనసాగుతోంది. 1960లలో భారత శాస్త్రవేత్తల సందర్శనలతో ప్రారంభమైన ఈ భాగస్వామ్యం నేడు అత్యాధునిక యాక్సిలరేటర్ సాంకేతికత,డిటెక్టర్ అభివృద్ధి,హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వంటి కీలక రంగాలకు విస్తరించింది. ఇటీవల సంవత్సరాల్లో భారత్ ప్రతి ఏడాది రూ.100కోట్లకు పైగా ఆర్థిక సహకారం అందిస్తోంది. భారత ప్రముఖ కణ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ తపన్ నాయక్ మాట్లాడుతూ, 1990లలోనే భారత శాస్త్రవేత్తలు ఎల్హెచ్సీలో కేవలం భాగస్వాములుగా కాకుండా,నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఆ ఆలోచన ఫలితంగానే భారత్లో తయారైన అనేక కీలక భాగాలు నేడు ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన ఈ శాస్త్రీయ యంత్రంలో ఉపయోగంలో ఉన్నాయని చెప్పారు.
వివరాలు
భారతదేశానికి ఈ ఆవిష్కరణ మరో ప్రత్యేకత
భారత పరిశోధనా సంస్థలు సూపర్కండక్టింగ్ మాగ్నెట్లు, క్రయోజెనిక్ వ్యవస్థలు,రేడియో ఫ్రీక్వెన్సీ సాంకేతికత,బీమ్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటి కీలక విభాగాల్లో విశేష సేవలందించాయి. ప్రస్తుతం భారత శాస్త్రవేత్తలు CERNలోని రెండు ప్రధాన ప్రయోగాల్లో పాల్గొంటూ డిటెక్టర్ల రూపకల్పన, నిర్మాణం,నిర్వహణతో పాటు అధిక శక్తి కణాల ఢీకొనింపుల నుంచి వచ్చే డేటాను విశ్లేషిస్తున్నారు. 2012లో హిగ్స్ బోసాన్ ఆవిష్కరణ ఆధునిక భౌతిక శాస్త్రంలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఈ పరిశోధనకు గాను 2013 నోబెల్ బహుమతి పీటర్ హిగ్స్,ఫ్రాంకోయిస్ ఎంగ్లర్ట్లకు లభించింది. అయితే భారతదేశానికి ఈ ఆవిష్కరణ మరో ప్రత్యేకతను కూడా అందించింది. హిగ్స్ బోసాన్లోని'బోసాన్'అనే పదం భారతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ గౌరవార్థం పెట్టినదే.
వివరాలు
ప్రధాన లక్ష్యం డార్క్ మ్యాటర్ అన్వేషణే
క్వాంటం గణాంకాలపై ఆయన చేసిన పరిశోధనలు ఈ తరహా కణాల అధ్యయనానికి పునాది వేశాయి. ప్రొఫెసర్ తపన్ నాయక్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రధాన లక్ష్యం డార్క్ మ్యాటర్ అన్వేషణేనని తెలిపారు. అంతేకాదు, బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే విశ్వంలో నెలకొన్న పరిస్థితులను మళ్లీ ప్రయోగశాలలో సృష్టించే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. విశ్వం ఆరంభ క్షణాల్లో జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవడమే ఈ ప్రయోగాల ప్రధాన ఉద్దేశమని వివరించారు.
వివరాలు
భవిష్యత్ పరిశోధనల్లో కూడా భారత శాస్త్రవేత్తలు కీలక పాత్ర
భవిష్యత్ పరిశోధనల్లో కూడా భారత శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధనా బృందాలు కొత్త తరం డిటెక్టర్ల అభివృద్ధిలో పాల్గొంటున్నాయి. CERNలో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ అర్చనా శర్మ మాట్లాడుతూ, భారత బలం కేవలం శాస్త్రీయ పరిశోధనలకే పరిమితం కాదని, ఇంజినీరింగ్, సాంకేతిక ఆవిష్కరణలు, యువ శాస్త్రవేత్తల తయారీలోనూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోందని పేర్కొన్నారు. వివిధ దేశాల శాస్త్రవేత్తలు కలిసి జ్ఞానాన్వేషణ కోసం పనిచేసే జీవంతమైన విశ్వంలా CERN ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. భారత్-CERN అనుబంధానికి సాంస్కృతిక కోణం కూడా ఉంది. 2004లో భారత్ బహుమతిగా అందించిన రెండు మీటర్ల ఎత్తైన నటరాజ స్వామి కాంస్య విగ్రహం నేడు CERNలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
వివరాలు
భవిష్యత్ శాస్త్రీయ పరిశోధనలకు దిశానిర్దేశం చేసే దేశంగా ఎదిగిన భారత్
సృష్టి-లయలకు ప్రతీకగా భావించే నటరాజుని నృత్యం, విశ్వంలోని సూక్ష్మ కణాల కదలికలకు ప్రతీకగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని పునరుద్ధరిస్తున్నారు. ఆధునిక భౌతిక శాస్త్రానికి, భారతీయ తాత్విక ఆలోచనలకు మధ్య వారధిలా ఈ విగ్రహం నిలుస్తోందని ప్రొఫెసర్ తపన్ నాయక్ తెలిపారు. ప్రస్తుతం భారత్ CERNలో కేవలం భాగస్వామిగా మాత్రమే కాకుండా, భవిష్యత్ శాస్త్రీయ పరిశోధనలకు దిశానిర్దేశం చేసే దేశంగా ఎదిగింది. గాడ్ పార్టికల్ ఆవిష్కరణలో భాగస్వామ్యం నుంచి డార్క్ మ్యాటర్ అన్వేషణ వరకు ప్రపంచ శాస్త్ర సమాజంలో భారత్ తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. 2030లో అప్గ్రేడ్ అయిన ఎల్హెచ్సీ మళ్లీ ప్రారంభమైన తర్వాత విశ్వ రహస్యాల అన్వేషణలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది.