SpaDeX: మార్చి 15 నుంచి 'స్పేడెక్స్' ప్రయోగాలను పునఃప్రారంభించనున్న ఇస్రో
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా నింగిలోనే ఉపగ్రహాలను అనుసంధానించే ప్రత్యేక మిషన్ను అమలు చేస్తోంది.
ఇప్పటికే రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించిన ఇస్రో, ఈ ప్రయోగాలను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమైంది.
మార్చి 15 నుంచి స్పేడెక్స్ (SpaDeX) ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు.
వివరాలు
ప్రయోగాల ప్రణాళిక
''ప్రస్తుతం ఉపగ్రహం దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంది. వివిధ ప్రయోగాలను నిర్వహించేందుకు వచ్చే రెండు నెలల్లో 10 నుంచి 15 రోజుల అనుకూల సమయం ఉంటుంది.ప్రస్తుతం ఉపగ్రహాలను విడదీసి, రీ-డాకింగ్ చేసే అనుకరణ ప్రయోగాలు చేపట్టుతున్నాం. ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం'' అని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ తెలిపారు.
జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన, మార్చి 15 నుంచి ఈ ప్రయోగాలను ప్రారంభిస్తామని తెలిపారు.
వివరాలు
భారత్ ఘనత
ఇస్రో చీఫ్ ప్రకారం,ఉపగ్రహాల్లో తగినంత ఇంధనం ఉంది కాబట్టి మరిన్ని ప్రయోగాలను చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు.
అలాగే,రెండు నెలల తర్వాత మరో అనుకూల సమయంలో మూడో దశ ప్రయోగాలను కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
డాకింగ్,దృఢత్వ ప్రయోగాల అనంతరం రెండు ఉపగ్రహాల మధ్య విద్యుత్ శక్తి బదిలీకి సంబంధించిన ప్రయోగాలు నిర్వహించాలని ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది.
ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో కీలక ముందడుగు వేస్తూ ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానించే మిషన్ను చేపట్టింది.
ఇందులో భాగంగా,2023 డిసెంబర్ 30న ఛేజర్,టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
పలు ప్రయత్నాల అనంతరం,జనవరి 16న డాకింగ్ ప్రక్రియ (SpaDeX) విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.