LOADING...
Shubhanshu Shukla: నా స్పేస్‌ ప్రయాణానికి పునాది వేసింది నా గురువులే : శుభాంశు శుక్లా
నా స్పేస్‌ ప్రయాణానికి పునాది వేసింది నా గురువులే : శుభాంశు శుక్లా

Shubhanshu Shukla: నా స్పేస్‌ ప్రయాణానికి పునాది వేసింది నా గురువులే : శుభాంశు శుక్లా

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2025
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) తన అంతరిక్ష యాత్ర వెనుక ఉన్న అసలైన కారణాన్ని వెల్లడించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ (IAF) అందించిన శిక్షణ, కాక్‌పిట్‌లో పొందిన అనుభవమే తనను స్పేస్‌ వరకు చేర్చిందని ఆయన తెలిపారు. ఐఏఎఫ్‌ తన జీవితంలో గొప్ప గురువులుగా నిలిచిందని, అంతరిక్ష యాత్రకు కావాల్సిన అన్ని మౌలిక అంశాలు అక్కడే నేర్చుకున్నానని అన్నారు. శుక్లా తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, అంతరిక్షం నుంచి భారత్‌ అద్భుతంగా, ఆహ్లాదకరంగా కనిపించింది. నా జీవితంలో చూసిన అత్యంత అందమైన దృశ్యం అదేనని అన్నారు. రాబోయే గగన్‌యాన్‌ ప్రాజెక్టుపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందని, అనేకమంది శాస్త్రవేత్తలు ఇందులో భాగస్వాములు కావాలని తహతహలాడుతున్నారని తెలిపారు.

Details

గగన్‌యాన్‌.. ఆత్మనిర్భర్ భారత్ దిశలో కీలక అడుగు: రాజ్‌నాథ్ సింగ్

దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మాట్లాడుతూ, గగన్‌యాన్‌ మిషన్‌ ఆత్మనిర్భర్ భారత్‌ వైపు ముందడుగని అభివర్ణించారు. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌కు చెందిన శుభాంశు శుక్లా అంతరిక్షంలో రైతుగా మారడం చారిత్రకమని అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో శుక్లా చేసిన ప్రయోగాలను గుర్తు చేస్తూ, గాజు పాత్రల్లో మెంతి, పెసర విత్తనాలను వేసి జీరో గ్రావిటీలో అవి ఎలా మొలకెత్తుతాయో అధ్యయనం చేశారని పేర్కొన్నారు. ఈ అనుభవం భవిష్యత్తులో భారత్‌ చేపట్టబోయే అనేక అంతరిక్ష యాత్రలకు మార్గదర్శిగా నిలుస్తుందని తెలిపారు.

Details

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ లక్ష్యం

రాజ్‌నాథ్ సింగ్ ప్రకారం 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో గగన్‌యాన్‌ మిషన్‌ కీలక పాత్ర పోషించనుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ అన్ని రంగాల్లో వేగంగా ముందుకు సాగుతోందని, ప్రపంచ దేశాలు ప్రస్తుతం న్యూదిల్లీతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నాయని చెప్పారు. అలాగే 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు