NASA: 2028లో చంద్రుడిపై వ్యోమగాములు.. మూన్ బేస్ ప్లాన్ బయటపెట్టిన నాసా
ఈ వార్తాకథనం ఏంటి
నాసా చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేసే దిశగా భారీ ప్రణాళికను ప్రకటించింది. దాదాపు 20 బిలియన్ డాలర్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఈ ఏడాదిలోనే మూడు ప్రత్యేక మిషన్లు చేపట్టి అవసరమైన పరికరాలను చంద్రుడికి పంపడంతో పాటు కీలక సాంకేతికతలను పరీక్షించనుంది. 2028 నాటికి వ్యోమగాములను చంద్రుడి ఉపరితలంపై దింపాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో మరో ఖగోళ ప్రపంచంపై మానవజాతి తొలి స్థావరం ఏర్పడనుంది.
వివరాలు
చంద్ర స్థావరంపై అంతరిక్ష పరిశోధన..
చంద్ర స్థావరం అంతరిక్ష పరిశోధనలో కీలక మైలురాయిగా నిలవనుందని నాసా పేర్కొంది. చంద్రుడిపై దీర్ఘకాలం మనుషులు జీవించేందుకు అవసరమైన సాంకేతికతలు, ప్రయోగాలకు ఈ బేస్ కేంద్రంగా పనిచేయనుంది. ఈ సందర్భంగా నాసా అడ్మినిస్ట్రేటర్ జేర్డ్ ఐసాక్మ్యాన్ మాట్లాడుతూ.. "అమెరికా మళ్లీ చంద్రుడిపై అడుగుపెడుతోంది. ఈ మూన్ బేస్ అమెరికాతో పాటు మొత్తం మానవజాతికి మరో ఖగోళ ప్రపంచంపై తొలి స్థావరంగా నిలుస్తుంది" అని తెలిపారు.
వివరాలు
మూన్ బేస్కు సంబంధించిన తొలి మిషన్..
మూన్ బేస్కు సంబంధించిన తొలి మిషన్ ఈ ఏడాది సెప్టెంబర్లో జరగనుంది. ఇందుకోసం బ్లూ ఆరిజిన్ రూపొందించిన "బ్లూ మూన్ మార్క్-1 ఎండ్యూరెన్స్" ల్యాండర్ను నాసా ఎంపిక చేసింది. ఈ మిషన్ ద్వారా స్టీరియో కెమెరాలు, లేజర్ రెట్రోరెఫ్లెక్టివ్ అరే వంటి పరికరాలను చంద్రుడికి పంపనున్నారు. వీటి సహాయంతో ల్యాండర్ థ్రస్టర్లు చంద్రుడి ఉపరితలంతో ఎలా ప్రభావితం అవుతున్నాయో అధ్యయనం చేయడంతో పాటు, కక్ష్యలో తిరిగే అంతరిక్ష నౌకలు లేజర్ కాంతి ప్రతిబింబాల ఆధారంగా తమ స్థానాన్ని మరింత ఖచ్చితంగా గుర్తించగలుగుతాయి.
వివరాలు
చంద్రుడిపై కార్యకలాపాలకు సిద్ధం..
మూడు దశల్లో ఈ మూన్ బేస్ ప్రోగ్రామ్ను అమలు చేయనున్నట్లు నాసా వెల్లడించింది. వచ్చే మూడు సంవత్సరాల్లో వివిధ సాంకేతికతలను పరీక్షించి చంద్రుడిపై కార్యకలాపాలకు సిద్ధం కానుంది. అలాగే 2028లో జరగనున్న ఆర్టెమీస్ III మిషన్లో చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాముల కోసం కనీసం ఒక లూనార్ టెర్రెయిన్ వాహనాన్ని కూడా పంపాలని యోచిస్తోంది. రెండో దశలో (2029-2032) విద్యుత్ గ్రిడ్ వంటి శాశ్వత మౌలిక వసతుల నిర్మాణం చేపట్టనుండగా, మూడో దశలో (2032 తర్వాత) చంద్రుడిపై దీర్ఘకాలిక మానవ నివాసాన్ని కొనసాగించేలా కార్యకలాపాలను మరింత విస్తరించనుంది.