LOADING...
Nasa: చందమామపై సులభంగా ప్రయాణించడానికి నాసా ఏర్పాట్లు.. 'సీఎల్‌వీ-1'వాహనాన్ని తయారు చేయనున్న ఆస్ట్రోలాబ్
'సీఎల్‌వీ-1'వాహనాన్ని తయారు చేయనున్న ఆస్ట్రోలాబ్

Nasa: చందమామపై సులభంగా ప్రయాణించడానికి నాసా ఏర్పాట్లు.. 'సీఎల్‌వీ-1'వాహనాన్ని తయారు చేయనున్న ఆస్ట్రోలాబ్

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2026
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

మానవుడు చంద్రుడిపై అడుగుపెట్టి చాలా కాలమే గడిచింది. అప్పటి నుంచి పలు దేశాలు చంద్రుడిపైకి రోవర్లను పంపుతూ అక్కడి రహస్యాలను తెలుసుకునేందుకు నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరింత ముందడుగు వేసింది. చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములు దీర్ఘకాలం నివసించేలా శాశ్వత ఆవాసాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.

వివరాలు 

దక్షిణ ధ్రువంపైనే దృష్టి

చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతం మానవ నివాసానికి అనువైన ప్రదేశంగా నాసా గుర్తించింది.అక్కడ దాదాపు నిరంతరంగా సూర్యకాంతి లభించడం,మంచు రూపంలో నీటి నిల్వలు ఉండటం ఇందుకు ప్రధాన కారణాలు. ఈ వనరులను వినియోగించుకొని వ్యోమగాములు అక్కడే ఎక్కువకాలం నివసిస్తూ పరిశోధనలు నిర్వహించే అవకాశం ఉంది. భవిష్యత్తులో అంగారక గ్రహానికి మానవ సహిత యాత్రలు చేపట్టేందుకు చంద్రుడిని మధ్యస్థావరంగా ఉపయోగించాలన్నది నాసా లక్ష్యం. అయితే చంద్రుడి ఉపరితలం రాళ్లు,గుట్టలు,దుమ్ము, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో కూడి ఉండటంతో అక్కడ ప్రయాణాలు చేయడం అంత సులభం కాదు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడమే కాకుండా, పరిశోధనా పరికరాలు,యంత్రాలను కూడా తరలించాల్సి ఉంటుంది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు నాసా ప్రత్యేక వాహనాల అభివృద్ధిపై దృష్టి సారించింది.

వివరాలు 

ప్రత్యేక చంద్ర వాహన నిర్మాణం

మానవ సహిత చంద్ర వాహనాల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కాలిఫోర్నియాకు చెందిన ఆస్ట్రోలాబ్ సంస్థను నాసా ఎంపిక చేసింది. చంద్రుడిపై వ్యోమగాములు సులభంగా సంచరించేలా ప్రత్యేక వాహనాలను రూపొందించాలని ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఈ ఒప్పందం విలువ సుమారు 219 మిలియన్ డాలర్లు. సంస్థ రూపొందిస్తున్న 'సీఎల్‌వీ-1' వాహనాన్ని 2028 నాటికి నాసాకు అందజేసే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

సీఎల్‌వీ-1 ప్రత్యేకత ఏమిటి?

ఆస్ట్రోలాబ్ సంస్థ తొలుత 'ఫ్లెక్స్' అనే రోవర్‌ను రూపొందించింది. ఇది సరుకు రవాణా, శాస్త్రీయ పరిశోధనలు, సాధారణ కార్యకలాపాలకు ఉపయోగపడేలా తయారైంది. అయితే నాసా అవసరాలకు అది పూర్తిగా సరిపోకపోవడంతో దానిలో విస్తృత మార్పులు చేసి 'సీఎల్‌వీ-1'గా రూపకల్పన చేశారు. ఈ కొత్త వాహనం కేవలం సామగ్రి రవాణాకే పరిమితం కాదు. ప్రత్యేక అంతరిక్ష దుస్తులు ధరించిన ఇద్దరు వ్యోమగాములు, వారి పరికరాలను సురక్షితంగా తరలించేలా దీనిని రూపొందించారు. చంద్రుడిపై శాశ్వత స్థావర నిర్మాణంలో సిబ్బందిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేర్చడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

Advertisement

వివరాలు 

ఆధునిక సౌకర్యాలతో రూపకల్పన

ఈ వాహనం చిత్రాలను ఇటీవల నాసా విడుదల చేసింది. నాలుగు చక్రాలతో కూడిన ఈ వాహనం రూపంలో చిన్న కారును తలపిస్తుంది. అంతరిక్ష దుస్తులు ధరించిన వ్యోమగాములు సులభంగా ఎక్కి దిగే విధంగా దీని నిర్మాణం ఉంది. దీనిలో గాలి అవసరం లేని ప్రత్యేక చక్రాలను అమర్చారు. చంద్రుడిపై ఉన్న వదులైన నేలపై ఇవి బలమైన పట్టును కల్పిస్తాయి. వాలుగా ఉన్న ప్రాంతాలు, రాతి అడ్డంకులను అధిగమించడంలో కూడా ఇవి సహాయపడతాయి. ఆస్ట్రోలాబ్ సంస్థ వెంటూరీ స్పేస్ సంస్థతో కలిసి ఈ వాహనాల అభివృద్ధి పనులు చేపడుతోంది.

వివరాలు 

గంటకు 9 కిలోమీటర్ల వేగం

అపోలో యుగంలో ఉపయోగించిన చంద్ర వాహనాల స్ఫూర్తితో మొదటి నమూనాను రూపొందించినప్పటికీ, ఆధునిక అవసరాలకు అనుగుణంగా అనేక సాంకేతిక మార్పులు చేశారు. సీఎల్‌వీ-1 సమతల ఉపరితలంపై గంటకు గరిష్ఠంగా 9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంతేకాకుండా నిటారుగా ఉన్న వాలులను కూడా అధిగమించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ వాహనం సహాయంతో ఇప్పటివరకు వ్యోమగాములు చేరుకోలేని లోతైన గోతులు, ఎప్పుడూ నీడలో ఉండే ప్రాంతాలు, శాస్త్రీయంగా కీలకమైన ప్రదేశాలను పరిశీలించే అవకాశం లభిస్తుంది. చంద్రుడిపై శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలన్న దశాబ్దాల నాటి కలను సాకారం చేయడంలో సీఎల్‌వీ-1 కీలక సాధనంగా మారనుంది.

వివరాలు 

శాశ్వత ఆవాసం కోసం మూడు దశల ప్రణాళిక

చంద్రుడిపై శాశ్వత నివాస నిర్మాణానికి నాసా మూడు దశల్లో కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం సుమారు 20 బిలియన్ డాలర్ల వ్యయాన్ని కేటాయించినట్లు నాసా ప్రతినిధి జేర్డ్ ఐజాక్‌మాన్ వెల్లడించారు. ఈ ప్రణాళికలో చంద్ర వాహనాలు, గగనతల పరిశీలనా యంత్రాలు కూడా భాగమవుతాయని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, చంద్రుడిపై నిర్మించే శాశ్వత స్థావరం అమెరికాకే కాకుండా మొత్తం మానవాళికి తొలి దీర్ఘకాల అంతరిక్ష నివాస కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

వివరాలు 

దశలవారీగా నిర్మాణం

మొదటి దశలో ఈ ఏడాది, వచ్చే ఏడాది పంపించే ల్యాండర్ల ద్వారా నిర్మాణ సామగ్రి, పరిశోధనా పరికరాలను చంద్రుడిపైకి తరలిస్తారు. రెండో దశలో 2029 నుంచి 2032 మధ్య విద్యుత్ వ్యవస్థతో కూడిన శాశ్వత నివాస నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. మూడో దశలో 2032 తర్వాత అక్కడ పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. 2028 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళిక విజయవంతమైతే భూమిపై మనుషులు సాధారణంగా చేసే ప్రయాణాల మాదిరిగానే, భవిష్యత్తులో చంద్రుడిపై నివసిస్తూ అక్కడి నుంచే పరిశోధనలు నిర్వహించే రోజులు దూరంలో లేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Advertisement