Human Eyes: మనిషి మెదడులో దాగి ఉన్న 'మూడో కన్ను' అవశేషం?.. అధ్యయనంలో ఆసక్తికర అంశాలు
ఈ వార్తాకథనం ఏంటి
మనిషి కళ్లకు, మెదడులో దాగి ఉన్న ఓ ప్రత్యేక అవయవానికి మధ్య కోట్ల ఏళ్ల నాటి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 60 కోట్ల సంవత్సరాల క్రితం నుంచే ఈ అనుబంధం ప్రారంభమై ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా "కరెంట్ బయాలజీ" జర్నల్లో ప్రచురించిన అధ్యయనంలో వెల్లడించారు. ఈ వివరాలను న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు మెదడులో లోతుగా ఉండే చిన్న "పీనియల్ గ్రంథి"పై దృష్టి పెట్టారు. బఠాణీ గింజంత పరిమాణంలో ఈ అవయవం నేరుగా సూర్యకాంతిని స్వీకరించకపోయినా, వెలుగు-చీకటి మార్పులకు శరీరం ఎలా స్పందించాలో నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా నిద్ర, మేల్కొనే సమయాలను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ను ఇది ఉత్పత్తి చేస్తుంది.
వివరాలు
కాంతిని గుర్తించే అవయవం...
ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు "ట్రై-కోర్నియా థియరీ" అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం పీనియల్ గ్రంథి, మనిషి కంటిలోని రెటినా రెండూ ఒకే పురాతన కాంతిని గుర్తించే అవయవం నుంచి పరిణామం చెందాయని వారు చెబుతున్నారు. దృష్టి వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకునేందుకు పరిశోధకులు దాదాపు 57.5 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన సముద్ర జీవిని అధ్యయనం చేశారు. మనిషి తొలి పూర్వీకుల్లో ఒకటిగా భావిస్తున్న ఈ చిన్న జీవికి రెండు పక్క కళ్లతో పాటు తలపై మరో ప్రత్యేక కాంతి స్పందన అవయవం ఉండేదని అధ్యయనం తెలిపింది. తలపై ఉన్న మూడో కాంతి గ్రాహక అవయవం వెలుగు స్థాయిలను గుర్తించి దిశాభ్రమ లేకుండా ఉండేందుకు సహాయపడేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
వివరాలు
శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..
సుమారు 50 కోట్ల సంవత్సరాల క్రితం వరకు ఈ శరీర నిర్మాణం కొనసాగిందని పరిశోధకులు తెలిపారు. ఆ తర్వాత కొన్ని జీవులు సముద్రపు మట్టిలోకి దూరి జీవించడం ప్రారంభించాయి. దీంతో దిశలను గుర్తించేందుకు పక్క కళ్ల అవసరం తగ్గిపోయింది. ఫలితంగా అవి పక్క కళ్లను కోల్పోయి, మూడో కాంతి గ్రాహక అవయవంపైనే ఎక్కువగా ఆధారపడటం ప్రారంభించాయి. దీని సహాయంతో పగలు-రాత్రి, పై-కింద దిశలను గుర్తించేవని అధ్యయనం పేర్కొంది. ఈ ప్రత్యేక పరిణామ క్రమమే వెన్నెముక కలిగిన జీవులను, పక్క కళ్లను కొనసాగించిన ఇతర జీవ సమూహాల నుంచి వేరు చేసిందని శాస్త్రవేత్తలు తెలిపారు.