WhatsApp Malware Alert: వాట్సాప్లో కొత్త మాల్వేర్ ముప్పు.. ఈ ZIP ఫైల్స్ ఓపెన్ చేస్తే ఖాతా హ్యాక్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా 10వేల మందికిపైగా భారతీయులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న భారీ వాట్సాప్ మాల్వేర్ దాడిని విజయవంతంగా అడ్డుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) చేపట్టిన సమన్వయ చర్యలతో ఈ సైబర్ ముప్పును నిలువరించినట్లు తెలిపింది. ఇటీవలి కాలంలో వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అవుతున్నాయంటూ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో అప్రమత్తమైన ఐ4సీ అధికారులు దర్యాప్తు చేపట్టగా,సైబర్ నేరగాళ్లు అమలు చేస్తున్న కొత్త తరహా మోసం బయటపడింది.
వివరాలు
ZIP ఫైల్స్ను విండోస్ కంప్యూటర్లో ఓపెన్ చేస్తే..
దర్యాప్తులో భాగంగా, ఆర్బీఐ (RBI), కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) వంటి ప్రభుత్వ సంస్థల పేర్లను ఉపయోగిస్తూ 'Statement of Account.zip', 'RBI.zip' వంటి పేర్లతో హానికరమైన ZIP ఫైల్స్ను వాట్సాప్, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా పంపిస్తున్నట్లు గుర్తించారు.
ఈ ZIP ఫైల్స్ను విండోస్ కంప్యూటర్లో ఓపెన్ చేసిన వెంటనే ట్రోజన్ వైరస్ సిస్టమ్లో ఇన్స్టాల్ అవుతుంది.
అనంతరం అది కంప్యూటర్పై పూర్తి నియంత్రణ సాధించి, యాక్టివ్గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్ను హైజాక్ చేస్తుంది.
తర్వాత హ్యాక్ అయిన ఖాతా నుంచే బాధితుడి కాంటాక్టులు, గ్రూపులకు అదే మాల్వేర్ ఫైల్స్ను ఆటోమేటిక్గా పంపిస్తూ దాడిని మరింత విస్తరిస్తుంది.
వివరాలు
ఢిల్లీ, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో వెలుగుచూసిన కేసులు
ఇలాంటి సైబర్ దాడులకు సంబంధించిన కేసులు ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో 'సహయోగ్ పోర్టల్' సహాయంతో మాల్వేర్కు సంబంధించిన కమాండ్ అండ్ కంట్రోల్ (C2) సర్వర్లను జియో-బ్లాక్ చేసి దాడిని అడ్డుకున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
ఇలాంటి మోసాలపై ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఇప్పటికే గత జూన్ 22న ప్రజలకు హెచ్చరిక జారీ చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది.
అనుమానాస్పద ZIP ఫైల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫైల్స్ను వెంటనే తొలగించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.