Loading...
Modi government: గూగుల్‌కు మోదీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. వందలాది Firebase అకౌంట్లు తొలగించాలని ఎందుకు చెప్పిందంటే?
గూగుల్‌కు మోదీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. వందలాది Firebase అకౌంట్లు తొలగించాలని ఎందుకు చెప్పిందంటే?

Modi government: గూగుల్‌కు మోదీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. వందలాది Firebase అకౌంట్లు తొలగించాలని ఎందుకు చెప్పిందంటే?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 22, 2026
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రభుత్వం టెక్ దిగ్గజం గూగుల్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. గూగుల్‌కు చెందిన Firebase ప్లాట్‌ఫామ్‌లోని వందలాది అకౌంట్లను తొలగించాలని ఆదేశించింది. మోసగాళ్లు ఈ సర్వీస్‌ను ఉపయోగించి ప్రముఖ బ్యాంకుల పేరుతో నకిలీ సేవలను సృష్టించడం, మాల్‌వేర్‌ను వ్యాప్తి చేయడం, ప్రజల ఆర్థిక సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దేశంలో ఆన్‌లైన్ చెల్లింపుల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. సైబర్ నేరగాళ్లు విస్తృతంగా ఉపయోగించే డిజిటల్ టూల్స్‌ను దుర్వినియోగం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

వివరాలు

ఆన్‌లైన్ మోసాలకు గూగుల్ Firebaseను ఉపయోగిస్తున్న స్కామర్లు..

భారత్‌లో ఆన్‌లైన్ మోసాలు చట్ట అమలు సంస్థలకు పెద్ద సవాల్‌గా మారాయి.

2025లో సైబర్ మోసాల కారణంగా దాదాపు 2.4 బిలియన్ డాలర్ల మేర నష్టం జరిగినట్లు అంచనా.

ఇలాంటి మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం నకిలీ వెబ్‌సైట్లను తొలగించాలని ఆదేశిస్తూ చర్యలు చేపడుతోంది.

అయితే ఇటీవల మరో విధానం వెలుగులోకి వచ్చింది. స్కామర్లు ఆన్‌లైన్ మోసాలకు గూగుల్‌కు చెందిన Firebase యాప్, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ టూల్‌ను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

వివరాలు

Firebaseలో ఉన్న వెబ్‌సైట్ల తొలగింపునకు I4C ఆదేశాలు..

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఆగస్టు నెలలోనే Firebaseలో హోస్ట్ చేసిన కనీసం 57 వెబ్‌సైట్లు, డేటాబేస్‌లను తొలగించాలని ఆదేశించింది.

ఈ వెబ్‌సైట్ల ద్వారా మాల్‌వేర్‌ను వ్యాప్తి చేయడంతో పాటు.. బాధితుల ఫోన్ల నుంచి సున్నితమైన ఆర్థిక సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు గుర్తించారు.

అంతేకాకుండా, ఆండ్రాయిడ్ ఆధారిత మాల్‌వేర్ ప్రోగ్రామ్‌లు నిజమైన బ్యాంకింగ్ సేవల మాదిరిగా కనిపించేలా రూపొందిస్తున్నారని I4C హెచ్చరించింది.

ముఖ్యంగా క్రెడిట్ కార్డులు ఉపయోగించే ఆండ్రాయిడ్ యూజర్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు

సైబర్ మోసాలపై గూగుల్ స్పందన..

తన ప్లాట్‌ఫామ్‌లో పెరుగుతున్న సైబర్ మోసాలపై గూగుల్ స్పందించింది.

ఫిషింగ్, మాల్‌వేర్, ఆర్థిక మోసాలకు వ్యతిరేకంగా కఠినమైన విధానాలను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది.

ఇలాంటి మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు, నోటీసులపై చర్యలు తీసుకునేందుకు I4C వంటి చట్ట అమలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని గూగుల్ పేర్కొంది.

అయితే అధికారులు నోటీసు జారీ చేసిన మూడు గంటల్లోగా సంబంధిత లింకులను గూగుల్ తొలగించకపోతే.. ఆ లింకుల వల్ల జరిగే నష్టానికి సంస్థ బాధ్యత వహించాల్సి వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

భారత్‌లో పెరుగుతున్న ఆన్‌లైన్ స్కామ్‌లు..

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది డెవలపర్లు యాప్‌లను రూపొందించేందుకు, వెబ్‌సైట్లను హోస్ట్ చేసేందుకు ఉపయోగించే గూగుల్ Firebaseను సైబర్ నేరగాళ్లు కూడా ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారు.

గత ఏడాది నుంచి మోసగాళ్లు ఇతర ఉచిత డిజిటల్ టూల్స్ నుంచి Firebase వైపు మారుతున్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది.

Firebaseలో అందుబాటులో ఉన్న ఉచిత సదుపాయాలు, మరింత మెరుగైన డేటాబేస్ ఫీచర్లు నేరగాళ్లను ఆకర్షిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ మార్పు భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆన్‌లైన్ మోసాల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తోంది.

ADVERTISEMENT