Loading...
Afghanistan Cricket Board: పాక్‌కు షాకిచ్చిన అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డ్‌.. మ్యాప్‌తో కొత్త వివాదం!
పాక్‌కు షాకిచ్చిన అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డ్‌.. మ్యాప్‌తో కొత్త వివాదం!

Afghanistan Cricket Board: పాక్‌కు షాకిచ్చిన అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డ్‌.. మ్యాప్‌తో కొత్త వివాదం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2026
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (ACB) రూపొందించిన ఓ ప్రచార వీడియో వివాదానికి దారితీసింది. ఈ వీడియోలో పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK), గిల్గిట్‌-బల్టిస్థాన్‌ ప్రాంతాలను భారత్‌లో భాగంగా చూపించినట్లు సమాచారం. దీంతో భారత్‌, అఫ్గానిస్థాన్‌ల మధ్య క్రికెట్‌ సిరీస్‌కు ముందే కొత్త దౌత్యపరమైన వివాదం తెరపైకి వచ్చింది. ఈ మ్యాప్‌పై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై పాకిస్థాన్‌ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్యలకు దిగలేదు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఈ విషయాన్ని లేవనెత్తేందుకు ఇస్లామాబాద్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

ఉద్రిక్తంగా అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ సంబంధాలు

ఇప్పటికే అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి.

సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత దిగజారుతున్న సమయంలో ఈ తాజా వివాదం చోటుచేసుకుంది.

పాకిస్థాన్‌లో జరుగుతున్న దాడులకు తెహ్రిక్‌-ఎ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (TTP) కారణమని ఇస్లామాబాద్‌ ఆరోపిస్తోంది. TTPకు అఫ్గాన్‌ తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారని పాకిస్థాన్‌ చాలాకాలంగా ఆరోపిస్తూ వస్తోంది.

ఈ నేపథ్యంలో అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రచార వీడియోలోని మ్యాప్‌ వివాదం ఇరు దేశాల మధ్య మరింత చర్చకు దారితీసింది.

ఇక భారత్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య మూడు టీ20ల సిరీస్‌ సెప్టెంబరు 13 నుంచి ప్రారంభం కానుంది. దిల్లీ వేదికగా ఈ సిరీస్‌ జరగనుండగా.. అఫ్గానిస్థాన్‌ ఆతిథ్య దేశంగా వ్యవహరించనుంది.

ADVERTISEMENT