Bhaichung Bhutia: భారత్-బ్రెజిల్ ఫ్రెండ్లీ మ్యాచ్ను బహిష్కరించండి: భైఛుంగ్ భూటియా
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ ఫుట్ బాల్ ఆటగాడు భైఛుంగ్ భూటియా అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశాడు. అక్టోబర్లో జరగనున్న భారత్-బ్రెజిల్ స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ను అభిమానులు బహిష్కరించాలని కోరాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన బ్రెజిల్తో మ్యాచ్ను కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మ్యాచ్ కోసం కనీసం రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందన్న నేపథ్యంలోనే భైఛుంగ్ భూటియా ఈ సూచన చేశాడు.
వివరాలు
సీడబ్ల్యూజీ 2030 క్రీడల కోసం ఖర్చు..
''బ్రెజిల్ మ్యాచ్ను బహిష్కరించండి. ఈ మ్యాచ్ను నిర్వహించాలనుకునే ప్రతి ఆర్గనైజర్, ప్రతి ఫెడరేషన్ ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.
ఈ మ్యాచ్ కోసం బెంగాల్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందా? లేక ఫండ్రైజింగ్ ద్వారా డబ్బు సేకరిస్తారా? అనేది స్పష్టంగా తెలియాలి.
ఈ మ్యాచ్ కోసం ఖర్చు చేసే డబ్బును వచ్చే కామన్వెల్త్ గేమ్స్లో మరిన్ని స్వర్ణ పతకాలు సాధించేందుకు ఉపయోగిస్తే బాగుంటుంది.
మీ దగ్గర రూ.30 కోట్లు ఉంటే.. భారత్ వేదికగా జరగనున్న సీడబ్ల్యూజీ 2030 క్రీడల కోసం ఆ మొత్తాన్ని ఖర్చు చేయాలి.
వివరాలు
బెంగాల్ నుంచి మరింత మంది ఒలింపియన్లు..
మన దేశానికి ఒలింపిక్స్ను తీసుకురావాలని అనుకుంటున్నాం. బెంగాల్ నుంచి మరింత మంది ఒలింపియన్లను తయారు చేసేందుకు ఆ డబ్బును వినియోగించాలి.
బ్రెజిల్ జట్టు ఇక్కడికి ఉచితంగా వచ్చి ఆడితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
కానీ అందుకు మనమే భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తే మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆ డబ్బును దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఫుట్బాల్ను అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందనేది నా అభిప్రాయం'' అని భైఛుంగ్ భూటియా స్పష్టం చేశాడు.