World Athletics Under-20: ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్లో భారత్ శుభారంభం.. ఫైనల్స్లోకి ముగ్గురు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ అథ్లెటిక్స్ అండర్-20 ఛాంపియన్షిప్లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. తొలి రోజు పోటీల్లో భారత అథ్లెట్లు ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచారు. జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్, ధరణీధరన్తో పాటు మహిళల డిస్కస్ త్రోలో అమానత్ కంబోజ్ ఫైనల్కు అర్హత సాధించారు. మరోవైపు పురుషుల 800 మీటర్ల పరుగులో మొగలి వెంకట్రామ్ సెమీఫైనల్కు చేరుకోగా, 4×400 మిక్స్డ్ రిలే జట్టు మాత్రం ఫైనల్ బెర్త్ దక్కించుకోలేక నిరాశపరిచింది.
వివరాలు
జావెలిన్లో అదరగొట్టిన ఆశిష్
పురుషుల జావెలిన్ త్రో గ్రూప్-ఏ క్వాలిఫికేషన్లో ఆశిష్ యాదవ్ 69.87 మీటర్ల త్రోతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు.
అయితే మొత్తం క్వాలిఫికేషన్లో దక్షిణాఫ్రికా టైటిల్ ఫేవరెట్ జాన్ హెండ్రిక్ హేమాన్స్ 74.49 మీటర్ల త్రోతో తొలి స్థానంలో నిలవగా, ఆశిష్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
అదే ఈవెంట్లో పోటీపడిన ధరణీధరన్ 68.07 మీటర్ల త్రోతో గ్రూప్-బిలో ఐదో స్థానంలో నిలిచాడు. మొత్తంగా 12వ స్థానంతో ఫైనల్కు అర్హత సాధించాడు.
అమానత్కు సీజన్ బెస్ట్
మహిళల డిస్కస్ త్రో గ్రూప్-ఏ క్వాలిఫికేషన్లో అమానత్ కంబోజ్ 52.58 మీటర్ల త్రోతో ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. గ్రూప్లో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
వివరాలు
సెమీఫైనల్లోకి వెంకట్రామ్
పురుషుల 800 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ మొగలి వెంకట్రామ్ ఒక నిమిషం 52.81 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. హీట్-5లో మూడో స్థానంలో నిలిచి సెమీఫైనల్కు అర్హత సాధించాడు.
రిలే జట్టుకు నిరాశ
భారత 4×400 మిక్స్డ్ రిలే జట్టు మాత్రం ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. పియూష్ రాజ్, తాహురా, సబీర్, తియా అర్ముగమ్లతో కూడిన భారత బృందం తమ హీట్లో నాలుగో స్థానంలో నిలిచింది.
మొత్తంగా 11వ స్థానంలో నిలవడంతో ఫైనల్కు చేరుకోలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది.
కాగా, 2022 ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ 4×400 మిక్స్డ్ రిలేలో రజత పతకం గెలిచింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు అదే భారత్కు అత్యుత్తమ ప్రదర్శనగా కొనసాగుతోంది.