LOADING...
Ireland T20: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి శ్రీకారం.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఆసక్తి
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి శ్రీకారం.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఆసక్తి

Ireland T20: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి శ్రీకారం.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఆసక్తి

వ్రాసిన వారు Moogati Shabari
Jun 25, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐర్లాండ్ పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్, గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐర్లాండ్ జట్టుతో శుక్రవారం తలపడనుంది. స్టోర్మాంట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ గ్రౌండ్ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ మ్యాచ్‌తో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. అలాగే యువ బ్యాటింగ్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్‌పై మరింత ఆసక్తి నెలకొంది. 2023 తర్వాత భారత్‌కు ఇది తొలి ఐర్లాండ్ పర్యటన కాగా, ఇటీవల 2026 టీ20 ప్రపంచకప్‌లో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఈ సిరీస్ ఆడుతోంది.

వివరాలు

పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది?

సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలోని పిచ్ ఇటీవల బ్యాటర్లకు అనుకూలంగా మారింది. బంతి బ్యాట్‌పై బాగా వస్తుండటంతో పరుగులు సాధించడం సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. వేగవంతమైన అవుట్‌ఫీల్డ్ కారణంగా షాట్లు ఆడిన బ్యాటర్లకు మంచి ఫలితం లభించే అవకాశం ఉంది. అయితే కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లకు కొంత సహకారం దక్కొచ్చు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ఉండగా, సోనీలివ్‌లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.

వివరాలు

వైభవ్ సూర్యవంశీ ఎంపికపై ఆసక్తి..

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి జట్టులో అవకాశం ఇవ్వాలా అనే విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్ ఎదురైంది. అతడిని తుది జట్టులోకి తీసుకుంటే, ఇటీవల టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ-సంజూ శాంసన్ ఓపెనింగ్ జోడీని విడగొట్టాల్సి రావచ్చు. అయితే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ చూపిన విధ్వంసకర బ్యాటింగ్, అలాగే దంబుల్లాలో ఇండియా-ఏ తరఫున ఆడిన 94 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ అతడిని అంతర్జాతీయ అరంగేట్రానికి బలమైన అభ్యర్థిగా నిలబెట్టాయి.

Advertisement

వివరాలు

భారత్ కెప్టెన్‌గా అయ్యర్ తొలి మ్యాచ్..

డిసెంబర్ 2023 తర్వాత తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్న శ్రేయాస్ అయ్యర్, ఈ మ్యాచ్‌తో భారత జట్టుకు మొదటిసారి నాయకత్వం వహించనున్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా సాధించిన విజయాల అనుభవాన్ని, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో ఉన్న సమన్వయాన్ని ఉపయోగించి దూకుడైన మిడిల్ ఆర్డర్‌ను మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాడు. అదే సమయంలో గాయం నుంచి కోలుకున్న హర్షిత్ రాణాను అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి తుది జట్టులోకి తీసుకురావాలా, లేక ఇటీవల మంచి ప్రదర్శనలు చేసిన ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలకు అవకాశం ఇవ్వాలా అనే అంశంపై కూడా భారత జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Advertisement

వివరాలు

ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు వీరే..

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఆడిన మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ 80కి పైగా పరుగులు చేసి సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 2025 ప్రారంభం నుంచి ఇప్పటివరకు శ్రేయాస్ అయ్యర్ టీ20ల్లో 1,102 పరుగులు చేశాడు. అతని సగటు 52.47 కాగా, స్ట్రైక్ రేట్ 172.18గా ఉండటం విశేషం. టీ20 అంతర్జాతీయాల్లో 127 వికెట్లతో అర్ష్‌దీప్ సింగ్ భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఐర్లాండ్ తరఫున హ్యారీ టెక్టర్ టీ20ల్లో 1,845 పరుగులతో నాలుగో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు. మరోవైపు జార్జ్ డాక్‌రెల్ 91 వికెట్లు పడగొట్టడమే కాకుండా 1,388 పరుగులు కూడా చేసి జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు.

పోల్

వైభవ్ సూర్యవంశీకి టీమిండియా క్యాప్ దక్కనుందా?

పోల్

వైభవ్ సూర్యవంశీకి టీమిండియా క్యాప్ దక్కనుందా?

Advertisement