
ENG vs IND: జస్ప్రిత్ బుమ్రా అద్భుత బౌలర్.. అన్ని టెస్టుల్లో ఆడించాలి : ఏబీ డివిలియర్స్
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఈ సందర్భంగా ఇరు జట్లు ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనున్నాయి. ఇప్పటికే లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. సిరీస్లో రెండో టెస్ట్ మ్యాచ్ జూలై 2న బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్లో నెగ్గే దిశగా టీమిండియా సన్నద్ధమవుతోంది. అయితే భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా వర్క్లోడ్ను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్లో కేవలం మూడు టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Details
బుమ్రా పూర్తిస్థాయి సిరీస్లో ఆడాలి: డివిలియర్స్
జస్ప్రిత్ బుమ్రా అద్భుతమైన బౌలర్. ఫార్మాట్ను పట్టించుకోకుండా అతని ప్రదర్శన ప్రశంసనీయం. అతన్ని కేవలం మూడు మ్యాచ్లకే పరిమితం చేయడం సరైన నిర్ణయం కాదు. టెస్ట్ క్రికెట్ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అటువంటి మ్యాచ్ల్లోనే అత్యుత్తమ ఆటగాళ్లు ఉండాలి. బుమ్రాను అయిదు టెస్ట్ల్లోనూ ఆడించాలి. వర్క్లోడ్ను తగ్గించాలంటే, అవసరమే లేని టీ20, వన్డేల నుంచి అతనికి విరామమివ్వాలని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
Details
డేల్ స్టెయిన్ ఉదాహరణతో సూచన
తన కెప్టెన్సీ రోజులను గుర్తు చేసిన డివిలియర్స్... ''మేము డేల్ స్టెయిన్ను వర్క్లోడ్కు అనుగుణంగా కీలక సిరీస్లలో మాత్రమే ఆడించేవాళ్లం. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్లాంటి బలమైన జట్లతో జరిగే టెస్ట్ సిరీస్లకే పరిమితం చేసేవాళ్లం. అదే తరహాలో బుమ్రాను కూడా వినియోగించాలి. టీమిండియా బుమ్రాను టెస్టుల్లో విశ్రాంతినివ్వడాన్ని నేను పూర్తిగా సమర్థించలేను. అయితే వైద్య నిపుణుల సలహా మేరకే బుమ్రా పూర్తిస్థాయి సిరీస్ ఆడకుండా ఉండాలన్న సూచన వచ్చి ఉండొచ్చు. అలా అయితే, దాన్ని గౌరవించాల్సిందే. బుమ్రా శరీరాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనే టీమ్ఇండియా వ్యూహం కావచ్చని డివిలియర్స్ వివరించాడు.