Krunal Pandya: ఆర్సీబీ స్టార్ క్రునాల్ పాండ్య ఖాతాలో అరుదైన ఐపీఎల్ రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. గత సీజన్లో తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకున్న ఆర్సీబీ.. ఈసారి వరుసగా రెండోసారి ఫైనల్కు చేరుకుంది. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్పై సునాయాస విజయం సాధించి ఫైనల్ బెర్త్ను ఖాయం చేసింది. ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో క్రునాల్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఐపీఎల్ ఫైనల్స్లో అతడు సాధించిన ఓ అరుదైన రికార్డు ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాలేదు. ఐపీఎల్ ఫైనల్స్లో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డు గెలిచిన ఏకైక ఆటగాడిగా క్రునాల్ నిలిచాడు.
వివరాలు
క్రునాల్ అద్భుత ప్రదర్శన..
గత సీజన్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో క్రునాల్ అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తున్న ప్రభ్సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ వికెట్లను తీసి మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పాడు. తన నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో 190 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ విజయవంతంగా కాపాడుకుంది. ఈ ప్రదర్శనకు గాను అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక దీనికంటే ముందే 2017 ఐపీఎల్ ఫైనల్లో కూడా క్రునాల్ ఇదే అవార్డు గెలిచాడు.
వివరాలు
ఐపీఎల్ రికార్డులు ఇవే..
ఇప్పటివరకు క్రునాల్ నాలుగు ఐపీఎల్ ఫైనల్స్ ఆడగా.. ప్రతి సారి విజేత జట్టులోనే నిలిచాడు. ఆర్సీబీతో 2025 టైటిల్ గెలిచే ముందు, ముంబై ఇండియన్స్తో 2017, 2019, 2020 సీజన్లలో కూడా ఛాంపియన్గా నిలిచాడు. ఈ సీజన్లో క్రునాల్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 15 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసిన అతడు 8.64 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్లో 225 పరుగులు చేసి సగటు 45, స్ట్రైక్రేట్ 147.05 నమోదు చేశాడు. మొత్తం ఐపీఎల్ కెరీర్లో క్రునాల్ 157 మ్యాచ్లు ఆడి 1,981 పరుగులు చేశాడు. మూడు హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. బౌలింగ్లో 7.59 ఎకానమీతో మొత్తం 106 వికెట్లు సాధించాడు.