టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్
నాగ్ పూర్ వేదికగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు టీమిండియా తుది జట్టులో ఆంధ్రా కుర్రాడు కేఎస్.భరత్ చోటు దక్కించుకున్నాడు. భరత్కు టీమిండియా క్రికెటర్ల సమక్షంలో టెస్ట్ క్యాప్ను సీనియర్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా అందజేశారు. టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో కొంతకాలంగా టీమిండియాలో వికెట్ కీపర్ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో రిషబ్ పంత్ స్థానాన్ని భరత్తో భర్తీ చేశారు. భారత్ కొంతకాలంగా టెస్టుల్లో బ్యాకప్ కీపర్గా కొనసాగుతున్నాడు. 86 ఎఫ్సి మ్యాచ్లలో 4707 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 27 అర్ధ సెంచరీలున్నాయి. 2022-23 రంజీ ట్రోఫీలో భరత్ బాగా రాణించిన విషయం తెలిసిందే.
అభినందనలు తెలిపిన ఏపీ సీఎం
స్వదేశంలో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్లో టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్. భరత్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో భరత్ అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు. పంత్ తాత్కాలికంగా ఫీల్డకి దూరంగా ఉన్నప్పుడు టెస్టుల్లో భరత్ ఆడాడు. ఇదే టెస్ట్ ఎంట్రీకి అతనికి సహాయపడినట్లు తెలుస్తోంది. 2018లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన పంత్ ఇప్పటివరకు 33 మ్యాచ్లలో 43.67 సగటుతో 2,271 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. భారత్ క్రికెట్ జట్టులో శ్రీకర్ భరత్ అరంగేట్రం పట్ల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా భరత్ ఫోటో షేర్ చేస్తూ సీఎం అభినందనలు తెలిపారు.