LOADING...
Lords Stadium: అమ్మకానికి చారిత్రక పిచ్‌.. ఎంసీసీ కీలక నిర్ణయం
అమ్మకానికి చారిత్రక పిచ్‌.. ఎంసీసీ కీలక నిర్ణయం

Lords Stadium: అమ్మకానికి చారిత్రక పిచ్‌.. ఎంసీసీ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన మైదానంగా పేరొందిన లార్డ్స్‌ క్రికెట్‌ స్టేడియం ప్రత్యేక స్థానం కలిగిఉంది. ఈ చారిత్రక మైదానాన్ని మెరిల్‌బోన్ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) నిర్వహిస్తోంది. లార్డ్స్‌లో సెంచరీ సాధించడం ఏ క్రికెటరైనా గొప్ప గౌరవంగా భావిస్తారు. అలాగే, ఇక్కడ ఐదు వికెట్లు తీయడం ఒక బౌలర్‌ను అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి ఆటగాడిగా నిలబెడుతుంది. ఇటీవలే టీమ్‌ ఇండియా, ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ మైదానంలో ఆడిన విషయం అభిమానులకు తెలిసిందే. ఇప్పుడు ఎంసీసీ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. లార్డ్స్‌ పిచ్‌తో పాటు మైదానం పచ్చిక (టర్ఫ్‌)ను కూడా విక్రయించేందుకు చర్యలు ప్రారంభించింది.

వివరాలు 

 అమ్మకాల ద్వారా సమకూరే మొత్తంలో 10 శాతం ఎంసీసీ ఫౌండేషన్‌కి.. 

మొదటగా ఈ అవకాశాన్ని లార్డ్స్‌ సభ్యులకు మాత్రమే కల్పించనుంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను సభ్యులకు అధికారికంగా తెలియజేసింది. అనంతరం సాధారణ క్రికెట్‌ అభిమానులకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఎంసీసీకి 25 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఈ అమ్మకంలో, 1.2 మీటర్ల పొడవు, 0.6 మీటర్ల వెడల్పు కలిగిన ప్రతి టర్ఫ్‌ భాగాన్ని 50 యూరోల (సుమారు రూ. 5,000) ధరకు విక్రయించనున్నారు. ఈ అమ్మకాల ద్వారా సమకూరే మొత్తంలో 10 శాతం ఎంసీసీ ఫౌండేషన్‌కి అందజేయనున్నారు. మిగిలిన నిధులను లార్డ్స్‌ మైదానంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు ఎంసీసీ వెల్లడించింది.

వివరాలు 

పాత టర్ఫ్‌ను తొలగించి, దాని స్థానంలో కొత్త సత్ఫలితాలిచ్చే పచ్చిక

''ఎంసీసీ ఫౌండేషన్‌కు నిధులు సమకూర్చడం, అలాగే భవిష్యత్తులో లార్డ్స్‌ క్రికెట్‌ మైదానాన్ని మరింత అభివృద్ధి చేయడమే ఈ నిర్ణయం వెనక ఉద్దేశం. ఎన్నో స్మరణీయ మ్యాచ్‌లకు వేదికైన ఈ పిచ్‌ మరియు టర్ఫ్‌పై క్రికెట్ అభిమానులు విశేష ఆసక్తి చూపుతారని మేము నమ్ముతున్నాం'' అని ఎంసీసీ అధికారిక ప్రకటనలో తెలిపింది. మైదానాన్ని పూర్తిగా కొత్త రూపంలో తీర్చిదిద్దే పనిలో భాగంగా పాత పచ్చికను తొలగించనున్నారు. ప్రస్తుతానికి 15 మిల్లీమీటర్ల పొడవు ఉన్న పాత టర్ఫ్‌ను తొలగించి, దాని స్థానంలో కొత్త సత్ఫలితాలిచ్చే పచ్చికను నాటేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పునరుద్ధరణ కార్యక్రమం సెప్టెంబర్‌ నెల నుంచి ప్రారంభం కానుంది.