Neeraj Chopra: లుసానె డైమండ్ లీగ్.. నీరజ్ x రుమేశ్
ఈ వార్తాకథనం ఏంటి
కామన్వెల్త్ క్రీడల్లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రాను వెనక్కి నెట్టి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న శ్రీలంక స్టార్ రుమేశ్ పతిరగెతో నీరజ్ మరోసారి తలపడనున్నాడు. కేవలం మూడు వారాల వ్యవధిలోనే వీరిద్దరి మధ్య మరో ఆసక్తికర పోటీకి రంగం సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న లుసానె డైమండ్ లీగ్లో నీరజ్తో పాటు రుమేశ్ కూడా బరిలోకి దిగుతున్నాడు. ఈ ఏడాది రోమ్ డైమండ్ లీగ్లో రుమేశ్ పతిరగె ఏకంగా 92.62 మీటర్ల దూరం జావెలిన్ విసిరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఇప్పటివరకు పాల్గొన్న తొమ్మిది టోర్నీల్లో ఎనిమిదింటిలో విజయం సాధించాడు. దీంతో లుసానె డైమండ్ లీగ్లో రుమేశ్ను నిలువరించడం నీరజ్కు పెద్ద సవాలుగానే మారింది.
వివరాలు
నీరజ్ చోప్రాకు పెద్ద సవాల్..
మరోవైపు వెన్నుగాయం నుంచి కోలుకున్న నీరజ్ చోప్రా దోహా డైమండ్ లీగ్తో తిరిగి పోటీల్లోకి వచ్చాడు.
అక్కడ 85.69 మీటర్ల దూరం జావెలిన్ విసిరి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
కామన్వెల్త్ క్రీడల్లోనూ నీరజ్ 85.83 మీటర్ల త్రో నమోదు చేశాడు. అయితే రుమేశ్ పతిరగె 89.75 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇప్పుడు లుసానెలో వీరిద్దరి మధ్య పోటీ ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ పోటీలో గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన వాల్కట్, చెకియాకు చెందిన వ్లాదిచ్, జర్మనీకి చెందిన వెబర్, అమెరికాకు చెందిన థాంప్సన్ వంటి స్టార్ జావెలిన్ త్రోయర్లు కూడా బరిలో ఉన్నారు.