LOADING...
IND vs SA: రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం.. ముగిసిన మూడో రోజు ఆట
రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం.. ముగిసిన మూడో రోజు ఆట

IND vs SA: రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం.. ముగిసిన మూడో రోజు ఆట

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2025
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా (IND vs SA) దాదాపు మ్యాచ్‌ను తన పట్టులోకి తీసుకుంది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ వరుస వైఫల్యాలతో టీమిండియా ఇవాళ గెలుపు అవకాశాలను కోల్పోయినట్లే కనిపిస్తోంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండటం టీమిండియాకు ఏకైక ఆశ. కఠినంగా పోరాడితే కనీసం మ్యాచ్‌ను డ్రాగా ముగించే అవకాశం మాత్రమే మిగిలి ఉంది. మూడో రోజు 9/0 స్కోరుతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ కేవలం 201 పరుగులకే ఆలౌటైంది. సఫారీ పేసర్ మార్కో యాన్సెన్ (6/48) ధాటికి భారత బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. 288 పరుగుల భారీ ఆధిక్యం ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా టీమిండియాకు 'ఫాలోఆన్‌' ఇవ్వలేదు. బదులుగా, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది.

Details

క్రీజులో రికెల్‌టన్‌, ఆడెన్ మార్‌క్రమ్‌ 

రోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు 26/0తో బాగానే నిలిచింది. రికెల్‌టన్‌ (13*), ఆడెన్ మార్‌క్రమ్‌ (12*) క్రీజులో ఉన్నారు. బుమ్రా వేసిన తొలి ఓవర్‌లోనే మార్‌క్రమ్‌కు లైఫ్ లభించింది. సెకండ్ స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ కష్టమైన క్యాచ్‌ను అందుకునేందుకు ప్రయత్నించినా విఫలమయ్యాడు. మొత్తానికి ప్రోటియాస్ ఇప్పటికే 314 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. భారత్ టాప్-ఆర్డర్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (58; 97 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) తప్ప ఇతర బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఒక దశలో 95/1తో బాగానే కనిపించిన భారత్, ఆకస్మిక పతనంతో 122/7 పరిస్థితికి చేరుకుంది. కేఎల్ రాహుల్ (22), సాయి సుదర్శన్ (15) పెద్ద స్కోర్లు ఇవ్వలేకపోయారు.

Details

తీవ్రంగా నిరాశపరిచన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లు

ధ్రువ్ జురెల్‌ (0), రిషభ్ పంత్‌ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) తీవ్రంగా నిరాశ కలిగించారు. తదుపరి నష్టాన్ని అడ్డుకునేందుకు వాషింగ్టన్ సుందర్‌ (48; 92 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), కుల్‌దీప్ యాదవ్‌ (19; 134 బంతుల్లో) ధైర్యంగా పోరాడారు. ఈ జోడీ ఎనిమిదో వికెట్‌కు 208 బంతుల్లో 72 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నిర్మించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ (6/48) విధ్వంసక లెవెల్ స్పెల్‌తో భారత్‌ను కుదేలుచేసాడు. సైమన్ హర్మర్‌ మూడు వికెట్లు, కేశవ్ మహరాజ్‌ ఒక వికెట్ తీసి భారత ఇన్నింగ్స్‌ను 201 పరుగుల వద్ద ముగించారు.