Loading...
IND vs ENG: ఎట్టకేలకు గెలిచిన టీమిండియా.. ఇంగ్లండ్‌పై తొలి వన్డేలో విజయం!
ఎట్టకేలకు గెలిచిన టీమిండియా.. ఇంగ్లండ్‌పై తొలి వన్డేలో విజయం!

IND vs ENG: ఎట్టకేలకు గెలిచిన టీమిండియా.. ఇంగ్లండ్‌పై తొలి వన్డేలో విజయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2026
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 సిరీస్‌ల్లో వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. ఇటీవల ఐర్లాండ్‌తో టీ20ల్లో ఓటమి, అనంతరం ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 0-4 తేడాతో వైట్‌వాష్ అయిన భారత్.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. 259 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (80, రిటైర్డ్ హర్ట్) ఆకట్టుకునే అర్ధశతకంతో అద్భుత ఆరంభం ఇచ్చాడు.

వివరాలు

విఫలమైన రో-కో

అయితే రోహిత్ శర్మ(11), విరాట్ కోహ్లీ(5) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరడంతో భారత్ ఒత్తిడిలో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (35)తో కలిసి గిల్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు.

అయితే మ్యాచ్ కీలక దశకు చేరుకున్న సమయంలో గిల్ గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడటం, ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (1) వరుసగా ఔటవడంతో భారత్ 160 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

ఈ పరిస్థితుల్లో బాధ్యత తీసుకున్న వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్), అక్షర్ పటేల్(57 నాటౌట్) అద్భుత పోరాటం చేశారు.

వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 102 పరుగులు జోడించి, ఇంకా 28 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.

వివరాలు

రాణించిన జో రూట్, లియామ్ డాసన్

భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఇంగ్లండ్ ఒక దశలో 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అయితే జో రూట్ (76 నాటౌట్), లియామ్ డాసన్ (68) అర్ధశతకాలతో పోరాడుతూ జట్టును గౌరవప్రదమైన స్కోరు దిశగా నడిపించారు.

చివరకు ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్ బంతితోనూ మెరిసి నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు.

ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ చెరో రెండు వికెట్లు సాధించి అక్షర్‌కు చక్కటి సహకారం అందించారు.

ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూలై 16న కార్డిఫ్‌లో జరగనుంది.

ADVERTISEMENT