Loading...
FIFA World Cup: మైదానంలో రగిలిన ఉద్రిక్తత.. బెల్లింగ్‌హామ్-అర్జెంటీనా ఆటగాళ్ల మధ్య తోపులాట!
మైదానంలో రగిలిన ఉద్రిక్తత.. బెల్లింగ్‌హామ్-అర్జెంటీనా ఆటగాళ్ల మధ్య తోపులాట!

FIFA World Cup: మైదానంలో రగిలిన ఉద్రిక్తత.. బెల్లింగ్‌హామ్-అర్జెంటీనా ఆటగాళ్ల మధ్య తోపులాట!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2026
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నా, మ్యాచ్ అనంతరం మైదానంలో చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోగా, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో లియోనెల్ మెస్సి తన అద్భుత ఆటతీరుతో మరోసారి మెరిశాడు. అతడు అందించిన రెండు కీలక అసిస్ట్‌లను ఎంజో ఫెర్నాండెజ్ (85వ నిమిషం), లౌటారో మార్టినెజ్ (90+2 నిమిషం) గోల్స్‌గా మలిచారు. దీంతో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది.

వివరాలు

బెల్లింగ్‌హామ్ ఆవేశం.. బార్కోతో ఘర్షణ

ఇంగ్లండ్ అభిమానుల ఆశలన్నీ స్టార్ మిడ్‌ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్‌పైనే ఉండగా, జట్టు ఓటమి అనంతరం అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు.

అర్జెంటీనా ఆటగాళ్లు విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో వాలెంటిన్ బార్కోతో అతడికి వాగ్వాదం జరిగింది.

ఆ సమయంలో బార్కో తలపై బెల్లింగ్‌హామ్ చేయి చేసుకున్నట్లు వీడియోల్లో కనిపించింది. బార్కో ఏదో వ్యాఖ్య చేయడంతోనే బెల్లింగ్‌హామ్ ఆగ్రహానికి గురైనట్లు సమాచారం.

ఆ తర్వాత బార్కోను తోసేయడంతో అర్జెంటీనా ఆటగాళ్లు వెంటనే స్పందించి బెల్లింగ్‌హామ్‌ను వెనక్కి నెట్టారు.

పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో ఇరు జట్ల ఆటగాళ్లు మధ్యలో జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు.

వివరాలు

మెస్సి-బెల్లింగ్‌హామ్ మధ్య కూడా వాగ్వాదం

మ్యాచ్ సందర్భంగా అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి, ఇంగ్లండ్ స్టార్ జూడ్ బెల్లింగ్‌హామ్ మధ్య కూడా మాటామాటా జరిగినట్లు సమాచారం.

ఈ ఘటన మ్యాచ్‌లో నెలకొన్న ఉద్రిక్తతను మరింత పెంచింది. మ్యాచ్ అనంతరం అర్జెంటీనా విజయోత్సవాల్లో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది.

జట్టు డిఫెండర్లు మార్టినెజ్‌, గియోవాని కలిసి "ఫాక్‌లాండ్స్ అర్జెంటీనాదే" అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించారు. దానిని అభిమానుల ముందుకు ఊపుతూ సంబరాల్లో పాల్గొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

ఫాక్‌లాండ్స్ వివాదం నేపథ్యం

ఫాక్‌లాండ్ దీవులపై అర్జెంటీనా, బ్రిటన్ మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ భూభాగం కోసం 1982 ఏప్రిల్ 2న రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది.

దాదాపు 74 రోజుల పాటు సాగిన ఈ పోరులో చివరకు బ్రిటన్ విజయం సాధించగా, అర్జెంటీనా సంధికి అంగీకరించింది.

ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన దాదాపు 900 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఫాక్‌లాండ్స్ అంశం రెండు దేశాల మధ్య సున్నితమైన రాజకీయ వివాదంగా కొనసాగుతూనే ఉంది.

ఇప్పుడు ప్రపంచకప్ సెమీఫైనల్ సందర్భంగా ఆ అంశం మరోసారి చర్చకు రావడం విశేషం.

ADVERTISEMENT