WAPL: ఆంధ్ర క్రికెట్లోకి ఉషోదయ ఎంట్రీ.. సెప్టెంబర్ 15 నుంచి మహిళల ఏపీఎల్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకోవడం ద్వారా తెలంగాణలో ఈ ఏడాది ప్రారంభమైన టీజీ20 లీగ్లోకి అడుగుపెట్టిన రామోజీ గ్రూపునకు చెందిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్.. తాజాగా ఆంధ్ర క్రికెట్లోనూ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ఆధ్వర్యంలో జరగనున్న మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్)లో సెంట్రల్ జోన్ జట్టు హక్కులను అత్యధిక బిడ్తో ఉషోదయ దక్కించుకుంది. సెంట్రల్ జోన్ ఫ్రాంఛైజీ కోసం ఉషోదయ సంస్థ రూ.89 లక్షల బిడ్ వేసి సొంతం చేసుకుంది. లీగ్లోని మిగిలిన మూడు జట్లను కూడా వివిధ సంస్థలు బిడ్డింగ్ ద్వారా దక్కించుకున్నాయి.
వివరాలు
జట్ల వివరాలు ఇవే..
గ్యారిసన్ కన్స్ట్రక్షన్స్ రూ.85.59 లక్షలతో ఒక జట్టును, ఓరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.77.77 లక్షలతో మరో జట్టును, ఎన్ఎస్ఆర్ ఇండస్ట్రీస్ రూ.61.11 లక్షల బిడ్తో ఇంకో జట్టును సొంతం చేసుకున్నాయి.
బిడ్డింగ్ ప్రక్రియతో పాటు మహిళల లీగ్కు సంబంధించిన వివరాలను విజయవాడలోని ఏసీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించారు.
విలేకరుల సమావేశంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కోశాధికారి దండమూడి శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కల్యాణ్కృష్ణ, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ వెల్లడించారు.
వివరాలు
సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు పోటీలు
మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ నిర్వహించనున్నట్లు కేశినేని శివనాథ్ తెలిపారు.
ఫ్రాంఛైజీల బిడ్డింగ్లో మొత్తం 11 సంస్థలు పాల్గొన్నాయని చెప్పారు.
బిడ్డింగ్కు నిర్ణయించిన కనీస మొత్తం రూ.35 లక్షలుగా ఉందని వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఈ ఏడాది ప్రారంభమైన టీజీ20 లీగ్ తొలి సీజన్లో ఉషోదయ సంస్థకు చెందిన హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.
వివరాలు
మిథాలీ రాజ్ నేతృత్వంలో మహిళల లీగ్..
మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్కు మిథాలీ రాజ్ నాయకత్వం వహించనున్నట్లు శివనాథ్ తెలిపారు.
గత ఏడాది కాలంగా ఆమె ఏసీఏకు కోచ్, మెంటార్గా సేవలు అందిస్తున్నారని చెప్పారు.
పురుషుల జట్టుకు కోచ్గా గ్యారీని నియమించినట్లు వెల్లడించారు.
మహిళల ఏపీఎల్ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు శివనాథ్ ప్రకటించారు.
మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ కోసం ఇప్పటికే 200 మందికిపైగా మహిళా క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారని మిథాలీ రాజ్ తెలిపారు.