Pakistan Team : మేము సెమీ ఫైనల్కి వెళ్లాలంటే అల్లా సాయం అవసరం : పాకిస్థాన్ టీమ్ డైరక్టర్
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ కు వెళ్లాయి. నాల్గో స్థానం కోసం అఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భారత జట్టు ఇప్పటికే ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.దీంతో సెమీస్లో నాల్గో స్థానంలో నిలిచే జట్టుతో భారత్ తలపడనుంది. ఈ తరుణంలో పాకిస్థాన్ టీమ్ డైరక్టర్ మిక్కీ ఆర్థర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము సెమీఫైనల్ కు వెళ్లాలంటే అల్లా సాయం కూడా అవసరమని చెప్పారు. అదే విధంగా మోకాలి గాయం నుండి తిరిగి వచ్చిన జమాన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని ప్రశంసలతో ముంచెత్తాడు.
ఇంగ్లండ్ పై తప్పకుండా విజయం సాధిస్తాం : మిక్కి ఆర్థర్
తాము సెమీ ఫైనల్లో కచ్చితంగా అడుగుపెడతామని, అయితే చివరి వరకు ఏమీ జరుగుతుందో తెలియదని మిక్కీ ఆర్థర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్పై తప్పకుండా విజయం సాధించి, సెమీఫైనల్ చేరుతామని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ సెమీఫైనల్ కు పాకిస్థాన్ చేరితే భారత్ తో తలపడే అవకాశముంది. పాకిస్థాన్ సెమీఫైనల్ అర్హత సాధించాలంటే ఇంగ్లాండ్ జట్టుపై పాకిస్థాన్ విజయం సాధించాలి. ఇక శ్రీలంక జట్టుపై న్యూజిలాండ్ కూడా ఓడిపోవాల్సి ఉంటుంది.