Ravichandran Ashwin: ఆ జట్టు నుంచి నేర్చుకోవాలి.. డబ్బులిచ్చి అయినా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాలి : అశ్విన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్తో జరుగుతున్న వన్డే సిరీస్ (IND vs NZ) కోసం న్యూజిలాండ్ అనుభవం తక్కువగా ఉన్న జట్టును ఎంపిక చేసింది. స్టార్ ఆటగాళ్లు లేని ఈ జట్టు, వడోదరలో జరిగిన తొలి వన్డేలో చివరి వరకూ గట్టిగా పోరాడి మ్యాచ్ను ఉత్కంఠభరితంగా మార్చింది. 301 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒక ఓవర్ మిగిలుండగానే విజయం సాధించినప్పటికీ, మ్యాచ్ అంత సులువుగా ముగియలేదు. వాస్తవానికి టీమిండియా ఇంకా చాలా ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించాల్సింది. అయితే కివీస్ బౌలర్లు పుంజుకుని కీలక వికెట్లు పడగొట్టడంతో భారత్పై ఒత్తిడి పెరిగింది. ఒక దశలో 234/2తో సాఫీగా సాగుతున్న భారత్.. 279/6 వద్ద ఇబ్బందుల్లో పడింది.
Details
న్యూజిలాండ్ పై ప్రశంసలు జల్లు
చివరకు కేఎల్ రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ జట్టు ప్రదర్శనపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. కివీస్ వ్యూహాలు ఎంతో బలంగా ఉంటాయని, వారి డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని ప్రణాళికలను దగ్గర నుంచి గమనించాలని తనకు ఉందని అశ్విన్ పేర్కొన్నాడు. చాలా అగ్రశ్రేణి జట్లు అన్ని విభాగాలపై సమానంగా దృష్టి పెట్టవు. కానీ న్యూజిలాండ్ ఈ విషయంలో చాలా మెరుగ్గా ఉంటుంది. వారి డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని ప్రణాళికలను చూడాలనుకుంటున్నా. అవసరమైతే దానికి డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వడోదర మ్యాచ్లో న్యూజిలాండ్ అద్భుతంగా పోరాడింది.
Details
వారు ఆశలు వదులుకోలేదు
అందుకు వారికి పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. మ్యాచ్ మధ్యలోనే వారు ఆశలు వదిలేయలేదు. ఆ జట్టు బలంగా లేదని నేను గతంలో ట్వీట్ చేశాను. అయినా క్రమశిక్షణ, ఫీల్డింగ్, ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేస్తూ అగ్రశ్రేణి జట్లకు గట్టి పోటీ ఇస్తున్నారని అశ్విన్ అన్నారు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే బుధవారం (జనవరి 14) రాజ్కోట్లో జరగనుంది.