RCB vs GT : ఫైనల్కు వర్షం ముప్పు.. రిజర్వ్ డే రోజు ఆట జరగకపోతే టైటిల్ ఎవరిది?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. టైటిల్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం (మే 31) అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లీగ్ దశలో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్కు చేరుకోవడం విశేషం. క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్పై 92 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసిన ఆర్సీబీ నేరుగా ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. మరోవైపు, క్వాలిఫయర్-1లో పరాజయం పాలైన గుజరాత్ టైటాన్స్, క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ పై అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
వివరాలు
మరొక రోజు ఆట కొనసాగే అవకాశం..
అయితే ఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయనే చర్చలు సాగుతున్నాయి. దీంతో మ్యాచ్ పూర్తిగా రద్దయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ట్రోఫీని ఇరు జట్లకు పంచుతారా? లేదా ఏ జట్టును విజేతగా ప్రకటిస్తారు? అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. లీగ్ దశలో వర్షం కారణంగా మ్యాచ్లు రద్దైనప్పుడు రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించే విధానం అమల్లో ఉంటుంది. కానీ ఫైనల్కు అలాంటి నిబంధన వర్తించదు. ఫైనల్ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ డే ఏర్పాటు చేశారు. నిర్ణీత రోజున మ్యాచ్ పూర్తికాకపోతే, తదుపరి రోజు అయిన జూన్ 1న ఆటను కొనసాగించే అవకాశం ఉంటుంది.
వివరాలు
అలాంటి పరిస్థితిలో విజేత ఎవరు?
ఫైనల్ రోజునే కాకుండా రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ నిర్వహించడం సాధ్యంకాకపోతే, లీగ్ దశ పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకే ఛాంపియన్ హోదా లభిస్తుంది. ఈ సీజన్ లీగ్ దశ ముగిసే సమయానికి ఆర్సీబీ మొదటి స్థానంలో నిలవగా, గుజరాత్ టైటాన్స్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. అందువల్ల ఫైనల్ మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే పరిస్థితి వస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరునే ఐపీఎల్ 2026 విజేతగా ప్రకటిస్తారు.